బడంగ్పేట : బీజేపీ పార్టీ విధానాలు నచ్చక టీఆర్ఎస్ పార్టీలో చేరిన మీర్పేట కార్పొరేటర్ నంద కుమార్ ఇంటి పై కాషాయ మూకలు కోడి గుడ్లు, రాళ్లతో దాడికి పాల్పడారు. బీజేపీ పార్టీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ కార్పొరేటర్ నందకుమార్ సోమవారం విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ లో చేరారు.
దీంతో బీజేపీ నాయకులు నాన గందర గోళం సృష్టించారు. బీజేపీ టీకెట్పై గెలిచి టీఆర్ఎస్లో ఎలా చేరుతావంటూ బీజేపీ నాయకులు దాడులకు తెగబడ్డారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వెంకటాద్రీ కాలనీలోని నందకుమార్ ఇంటిపై మంగళవారం ఉదయం బీజేపీ నాయకులు దాడులకు పాల్పడారు.
బీజేపీ కార్పొరేటర్ ఎడ్ల మల్లేష్, బీజేపీ నాయకులు బుచ్చిరాములు, రామకృష్ణ, తదితరుల ఆధ్వర్యంలో దాడికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా ఇంటి వెనుక భాగం నుంచి వచ్చి దాడులకు పాల్పడటంతో ఇంట్లో ఉన్న వారు ఏం జరుగుతుందో తెలియక భయా బ్రాంతులకు గురయ్యారు.
భయం గుప్పిట్లో స్థానికులు
వెంకటాద్రీ కాలనీలో తెల్లవారుజామున చాలా మంది నిద్రలోంచి లేవక ముందే బీజేపీ కార్పొరేటర్స్, నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి నందు ఇంటి పై కోడి గుడ్లు, రాళ్లతో దాడులు చేయడంతో స్థానికులు భయా బ్రాంతులకు గురి అయ్యారు. అసలు ఎవరు ఎందుకు వచ్చి దాడులు చేస్తున్నారో తెలియక ఆందోళనకు లోనయారు.
కాలనీలో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదని స్థానికులు చెప్తున్నారు. ఏదైనా ఉంటే శాంతి యుతంగా పరిష్కరించుకోవాలి తప్ప కాలనీలో ఇలా దాడులు చేయడం మంచి పద్దతి కాదని స్థానికులు మండి పడ్డారు.
బిజేపీ నాయకుల అరెస్ట్
కార్పొరేటర్ నందకుమార్ ఇంటి పై బీజేపీ నాయులు దాడులు చేస్తున్నారని తెలిసి మీర్పేట పోలీసులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి నిలువరించే ప్రయత్నం చేసినా ఆగకుండా దాడులకు పాల్పడారు.
కాగా దాడులకు పాల్పడిన కార్పొరేటర్ ఎడ్ల మల్లేష్ ముదిరాజ్, బుచ్చి రాములు లను పోలీసులు అదుపులోకి తీసుకొని మీర్పేట పోలీస్ స్టేషన్కు తరలించారు. దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తామని సిఐ మహేందర్ రెడ్డి తెలిపారు.