మణుగూరు రూరల్, జనవరి 20 : బీజేపీ నేతల నీతులు.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగానే ఉన్నాయని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు విమర్శించారు. గిరిజనులకు పది శాతం రిజర్వేషన్పై శాసనసభ సాక్షిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపితే దాని అమలును తెలంగాణ బీజేపీ నేతలు పట్టించుకోలేదని ఆరోపించారు. ఇలాంటివి మరుగున పెట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. గిరిజనుల తరఫున పోరాడేది తానేనంటూ ప్రగల్భాలు పలకడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మణుగూరులోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ‘నమస్తే తెలంగాణ’తో ఆయన మాట్లాడారు. బండి సంజయ్ బుధవారం గచ్చిబౌలిలో మిషన్ 12 పేరుతో సమావేశం ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో 12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుస్తామని వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం నిజంగా పోరాడేవారికి పది శాతం రిజర్వేషన్ తీసుకొచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన చట్టంలో చెప్పిన ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటును.. అధికారంలోకి వచ్చాక బీజేపీ మర్చిపోయిందని విమర్శించారు. టీఆర్ఎస్ ఎంపీలు పలుమార్లు గుర్తుచేసినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కేంద్రం పరిధిలోనిదేనని, కటాఫ్ డేట్ 2005 వరకే ఉన్నా దాని లోటుపాట్లు సవరణకు నోచుకోకపోయాయని అన్నారు. ఇంతవరకు గిరిజనులకు చేసిందేమీ లేని బీజేపీ నేతలకు తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించే నైతికహక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. 12 ఎస్టీ నియోజకవర్గాల్లో గెలుపుపై ఆశలు మానుకొని రాబోయే ఎన్నికల్లో ఆదిలాబాద్లోని ఉన్న ఎంపీ సీటుకు డిపాజిట్ దక్కేంచుకునేందుకు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని హితవు పలికారు. రాబోవు ఎన్నికల్లో గిరిజనులే బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై బురదజల్లే చర్యలకు స్వస్తి పలకాలని సూచించారు.