బడంగ్పేట : తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడై మీర్పేట 13వ డివిజన్కు చెందిన బీజేపీ కార్పొరేటర్ నరేంద్ర కుమార్ (నందు) విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో సోమవారం గులాబీ గూటికి చేరారు. మంత్రి టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి అహ్వానించారు.
నందుకుమార్ భాటలోనే మరి కొంత మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్స్ కారు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మీర్పేట, బడంగ్పేటకు చెందిన మరి కొంత మంది కూడా గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఎదురు లేని శక్తి అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి అవుతున్నట్లు గమనిస్తున్న ప్రజా ప్రతినిధులు, నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఉత్సహం చూపుతున్నారని అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారనే సాధ్యం అవుతుందని నాయకులకు విశ్వాసం ఉందన్నారు.
తెలంగాణ సాధించిన పార్టీ ఏదైనా సాధిస్తుందన్న నమ్మకం ప్రజలలో బలంగా ఉందన్నారు. మహేశ్వరం నియోజక వర్గంలోని మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్, డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధిని అందరూ గమనిస్తున్నారని ఆమె అన్నారు. అను నిత్యం ప్రజల్లో ఉంటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానన్నారు.
ఈ కార్యక్రమంలో మీర్పేట డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, ప్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, కార్పొరేటర్ పెద్ద బావి సుదర్శన్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు దీప్లాల్ హన్, రమేష్, రాకేష్ తదితరులు ఉన్నారు.