కొత్తగూడెం క్రైం, ఫిబ్రవరి 1: మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మాదకద్రవ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, తామూ మత్తును చిత్త చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని భద్రాద్రి ఎస్పీ సునీల్దత్ అన్నారు. పొరుగు రాష్ర్టాల నుంచి జరుగుతున్న గంజాయి రవాణాను సమూలంగా నిర్మూలించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెంలోని తన కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల సహకారంతో సంయుక్తంగా దాడులు నిర్వహించి గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేస్తామన్నారు. భద్రాద్రి జిల్లా మీదుగా తరలుతున్న గంజాయిపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. గంజాయి నిర్మూలనలో భద్రాద్రి జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 566 మంది రవాణాదారులు, విక్రయదారులు, వినియెగదారులు, గంజాయి సాగుదారులపై 195 కేసులు నమోదు చేసి 29,680 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. రవాణా చేస్తున్న వాహనాలను సైతం సీజ్ చేసినట్లు వివరించారు. ఈ దందాలో ప్రమేయమున్న 106 మందిపై ‘హిస్టరీ షీట్స్’ తెరిచామని, వారిపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. 20 మంది గంజాయి వ్యాపారులపై ‘పీడీ’ యాక్ట్ ప్రయోగించినట్లు చెప్పారు. అంతేకాకుండా గంజాయి దందాతో సంబంధం ఉన్న 8 మంది నేరస్తులకు న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించిందన్నారు. ఎవరైనా గంజాయి సాగు చేసినా, అందుకు సహకరించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల కాచనపల్లిలో ఓ వ్యక్తి సాగు చేసిన గంజాయి పంటను ధ్వంసం చేసి అతడిపై కేసు నమోదు చేశామన్నారు. ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు. గంజాయిని నిర్మూలనలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, నిత్యం వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కళాశాలల హెచ్వోడీలతో సమీక్షలు నిర్వహించి మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయికి బానిసైలైన వారి వివరాలు సేకరించి లిస్ట్ తయారు చేస్తున్నామని, వారితో పాటు వారి కుటుంబీకులకు సైతం కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అన్నారు. ఎవరైనా గంజాయి విక్రయించినా, కొనుగోలు చేసినా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కి లేదా 100 డయల్కి సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ హామీ ఇచ్చారు. అదనపు ఎస్పీ (అడ్మిన్) కేఆర్కే ప్రసాద్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ పాల్గొన్నారు.