అశ్వారావుపేట, జనవరి 30: ప్రభుత్వ బడులంటే శిథిలమైన భవనాలు.. పెచ్చులూడే తరగతి గదులు..తలుపులు లేని మరుగుదొడ్లు అన్న రోజులు పోతున్నాయి.. పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో ‘ఇంగ్లిష్’ విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది నుంచే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందనున్నది. పథకానికి విడుదలయ్యే నిధులతో పాఠశాలలకు అవసరమైన కిచెక్ షెడ్లు, తరగతి గదులు, కొత్త భవనాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, ప్రహరీలు, డిజిటల్ తరగతులు వంటి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు చెల్లించలేక, నాణ్యమైన విద్య అందించలేక ఎంతోమంది తల్లిదండ్రులు నిరాశ చెందుతున్నారు. ఈ దశలోనే సీఎం కేసీఆర్ ‘మన ఊరు – మన బడి’కార్యక్రమం ప్రకటించారు. పేద విద్యార్థులకు ఈ కార్యక్రమం ఎంతో మేలు చేస్తుందన్న అభిప్రాయం తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతున్నది. ఆంగ్ల విద్య చదువువుకున్న విద్యార్థులు మున్ముందు పోటీ పరీక్షల్లోనూ సత్తా చాటే అవకాశం ఉన్నది.‘మన ఊరు – మన బడి’ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్వాగతిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నేతలు అభినందిస్తున్నారు.
సర్కార్ విద్య బలోపేతం అవుతుంది..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ‘మన ఊరు – మన బడి’తో ప్రభుత్వ బడులు బలోపేతం అవుతాయి. నిరుపేదల పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుంది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఇంగ్లిష్ వస్తే వారి భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలు సునాయాసంగా ఎలాంటి పోటీ పరీక్షనైనా రాయగలిగే సామర్థ్యాలను తెచ్చుకుంటారు.
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య..
‘మన ఊరు-మన బడి’ పథకంతో నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో ఆంగ్ల విద్య అందుతుంది. బడుల్లో మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. పిల్లలకు కార్పొరేట్ విద్య అందించాలనే తల్లిదండ్రుల కోరిక ఈ పథకంతో నెరవేరుతుంది. సీఎం కేసీఆర్ విద్యారంగంలో గొప్ప సంస్కరణలు తీసుకువస్తున్నారు. వచ్చే ఏడాది నుంచే ఆంగ్ల విద్య ప్రారంభం అవుతుందంటే సంతోషంగా ఉంది.
ప్రైవేట్ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని నిరాశ పడే పేదపిల్లల తల్లిదండ్రులకు ‘మన ఊరు-మన బడి’ శుభవార్త. ఫీజులు చెల్లించలేక, అసౌకర్యాల మధ్య చదువుకుంటున్న విద్యార్థులకు ఈ కార్యక్రమం వరం. అభివృద్ధి పనులు పూర్తయితే ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు ఎంతో అవసరం.
ప్రభుత్వ పాఠశాలల్లో సకల వసతులు..
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పూర్తి సౌకర్యాల మధ్య విద్యార్థులు ఇంగ్లిష్ మీడియం చదువుకుంటారు. విద్యా విధానంలో ప్రభుత్వం సమానత్వం తీసుకురావడం శుభపరిణామం. సర్కార్ బడుల్లో ఆంగ్ల విద్య అందించడాన్ని స్వాగతిస్తున్నాం. ఈ పథకం తప్పకుండా సత్ఫలితాలనిస్తుంది.