ఖైరతాబాద్ : ఉద్యోగాల కోసం నిరుద్యోగ దీక్ష చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్… కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో స్పష్టం చేయాలి….ఇక్కడ కాదు….ఢిల్లీలో దీక్ష చేపట్టాలని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం అన్నారు.
సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014లో ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రతి ఏడాడి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ప్రకటించారని, ఏడు సంవత్స రాలు గడుస్తున్నదని, ఇప్పటి వరకు 14 కోట్ల ఉద్యోగాలు రావాలని, ఎన్ని ఉద్యోగాలిచ్చారో సమాధానం చెప్పాలన్నారు.
బండి సంజయ్ కేంద్రాన్ని ప్రశ్నించకుండా ఇక్కడ దీక్షలు చేపట్టడం సిగ్గు చేటన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చారో ఆ పార్టీ తెలంగాణ ఇన్చార్జి తరుణ్చుగ్ చెప్పాలన్నారు. బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత రిజర్వేషన్లు ఏ మేరకు అమలు చేశారో బండి బదులు చెప్పాలన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనే శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేసిందని, దళిత, రైతు బంధు లాంటి పథకాలు తీసుకువచ్చి అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నదన్నారు. బీసీలపై చిత్తశుద్ది ఉంటే బీసీ బిల్లు పెట్టాలని కేంద్రాన్ని కోరాలన్నారు. రైతాంగంపై ఉక్కుపాదం మోపుతున్నారన్నారు. బీజేపీ చేస్తున్న ఈ చర్యలను ప్రజలకు బహిర్గతం చేస్తామన్నారు.
కేంద్రం హామీలో చెప్పిన విధంగా ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేస్తూ జనవరి 8న ఇందిరా పార్కు వద్ద దీక్ష చేస్తున్నామన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు పేట భాస్కర్, బొంకూరు నరేందర్, రాష్ట్ర ప్లానింగ్ కమిటీ అధ్యక్షులు కె. శ్రీనివాస్, టూవీలర్ అసోసియేషన్ రాస్ట్ర అధ్యక్షులు తోడేటి బాబు, టీఏవైఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. చంద్రమౌళి, తాండూరి దేవయ్య, ఎస్కె సుల్తాన్, కల్వల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.