ఎర్రగడ్డ : బాధిత కుటుంబాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుని అండగా ఉంటుందని బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ అన్నారు. బోరబండ ప్రాంతం ఇందిరానగర్ బస్తీకి చెందిన గోపి (35) ప్రైవేటు ఎలక్ట్రిషన్గా పని చేస్తుండేవాడు. విద్యుదాఘాతం కారణంగా ఇటీవల చనిపోయాడు.
ఆయనకు భార్య స్వప్న, నలుగురు కుమార్తెలున్నారు. బాబా ఫసియుద్దీన్ చొరవతో రూ.2 లక్షల నష్ట పరిహారం లభించగా మృతుని కుమార్తెల పేరుతో పోస్టాఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు. వీటికి సంబంధించిన పాస్ బుక్కులను గురువారం బోరబండ పార్టీ కార్యాలయం వద్ద బాధిత కుటుంబానికి బాబా ఫసియుద్దీన్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేయర్ సహాయనిధితో పాటు ప్రభుత్వం తరపున గోపి కుటంబానికి ఆర్థిక సాయం అందేలా చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక నేతలు నర్సింహ, సుధాకర్, ఇమ్రాన్, ఖలీల్, శ్రీకాంత్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.