జడ్చర్ల, జనవరి 19 : రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని లింగంపేట గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 30 మంది నాయకులు, కార్యకర్తలు సర్పంచ్ హైమావతి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కండువా కప్పి ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రై తులకు నిరంతర విద్యుత్తోపాటు రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. వృద్ధులు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు పెన్షన్లు అందిస్తూ ఆసరాగా నిలుస్తున్నట్లు చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు పునర్జీవం, మట్టి తొలగింపుతో కుంటలు పటిష్టమవుతున్నాయని చెప్పారు. మిషన్ భగీరథతో మంచినీటి కష్టాలు తీరాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్కు వలస కడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో వెంకట్రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ శ్రీకాంత్రెడ్డి, ఇమ్మూ, పటోళ్ల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.