కొవిడ్ మహమ్మారి పడగ విప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి జ్వరసర్వేకు శ్రీకారం చుట్టింది. వైద్యారోగ్యశాఖను అప్రమత్తం చేసి ఇంటింటి సర్వే చేయాలని ఆదేశించడంతో సిబ్బంది రంగంలోకి దిగారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, కలెక్టర్ వీపీ గౌతమ్ పర్యవేక్షణలో జిల్లా వైద్యారోగ్యశాఖ జ్వర పీడితులను గుర్తిస్తున్నారు. జిల్లాలో 4 అర్బన్హెల్త్ సెంటర్స్, 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో సర్వే నిర్వహిస్తున్నారు. శనివారం రెండోరోజు జిల్లావ్యాప్తంగా 1,554 బృందాలు ఇంటింటి సర్వేలో పాల్గొన్నాయి. ఆశా వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, వీఆర్ఏలు మొత్తం 73,273 ఇండ్లను సందర్శించారు. 2,445 మంది జ్వర పీడితులను గుర్తించారు. వారికి మందుల కిట్స్ను అందించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వారం రోజులపాటు మందులు వాడాలని, అప్పటికీ జ్వరం లేదా దగ్గు, ఆయాసం తగ్గనట్లయితే మెరుగైన వైద్యం కోసం సమాచారం ఇవ్వాలని బాధితులకు అవగాహన కల్పించారు.
భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ ఖమ్మం సిటీ, జనవరి 22: ‘మీ ఇంట్లో ఎవరికైనా జ్వరం లక్షణాలు ఉన్నాయా? ఉంటే ఈ మందులు వేసుకోండి. నిమ్మళం అవుతారు. వారం రోజులుగా తగ్గడం లేదా? అయితే పదండి.. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తాం..’ అంటూ ఇంటింటినీ సందర్శిస్తున్నారు వైద్యారోగ్య శాఖ సిబ్బంది. కరోనా కట్టడి, వ్యాప్తి నివారణ, జ్వర పీడితుల గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన ఇంటింటి జ్వర సర్వే శనివారం రెండో రోజుకు చేరుకుంది. భద్రాది కొత్తగూడెం జిల్లాలో 969 బృందాలు ఇంటింటి సర్వే చేసి 3,914 మంది జ్వర పీడితులను గుర్తించాయి. ఖమ్మం జిల్లాలో 1,554 బృందాలు 73,273 ఇళ్ల సందర్శించి 2,445 మందికి కిట్లు అందించాయి.
కరోనా థర్డ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆదేశానుసారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంటింటి సర్వే రెండో రోజు శనివారమూ ముమ్మరంగా కొనసాగింది. ఖమ్మం జిల్లాలో 4 అర్బన్ హెల్త్ సెంటర్లు, 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో సర్వే జరుగుతోంది. తాజాగా అందిన సమాచారం మేరకు శనివారం 1,554 బృందాలు ఇంటింటి సర్వేలో పాల్గొన్నాయి. మొత్తం 73,273 ఇండ్లను సందర్శించారు. 2,445 మంది జ్వర పీడితులను గుర్తించి కరోనా మందుల కిట్లను అందించి తగు సలహాలు, సూచనలు అందించారు. కనీసం వారం రోజులపాటు మందులు వాడాలని, అప్పటికీ జ్వరం లేదా దగ్గు, ఆయాసం తగ్గనట్లయితే మెరుగైన వైద్యం కోసం తమకు సమాచారం ఇవ్వాలని అవగాహన కల్పించారు. వచ్చే బుధవారం నాటికి సర్వే పూర్తవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకుని బృందాలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నాయి. భద్రాదిద్రి జిల్లాలో 969 బృందాలు 65,777 ఇళ్లను సందర్శించి 3,914 మంది జ్వర పీడితులను గుర్తించి మందుల కిట్లు అందజేశారు.
కొనసాగుతున్న టీకా..
భద్రాద్రి జిల్లాలో వ్యాక్సినేషన్ కూడా ముమ్మరంగా సాగుతోంది. టీనేజర్ల టీకాలు 52,318 మందికి గాను 48,897 మందికి వేశారు. కరోనా రెండో డోస్ 1,38,232 మందికి గాను 1,39,076 మందికి వేశారు. ప్రికాషన్ డోస్ 44,118 మందికి గాను 13,939 మందికి అందించారు.
ఒక్కరోజే 297 మందికి పాజిటివ్..
భద్రాద్రి జిల్లాలో కరోనా పరీక్షలు కూడా పెంచారు. శనివారం ఒక్కరోజే 297 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మొత్తం 5,285 మందికి పరీక్షలు చేయగా 297 మందికి కొవిడ్ ఉన్నట్టు తేలింది.