గోల్నాక : అంబర్పేట ఛే నంబరు చౌరస్తా ఫ్లై ఓవర్ నిర్మాణంలో భాగంగా ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంతో పాటు భవిష్యత్తు ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా రహదారి విస్తరణ పనులు వేగవంతం చేశామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
శుక్రవారం ఆయన కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్, జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తదితరులతో అంబర్పేట అలీకేఫ్ చౌరస్తా నుంచి నాగోల్ వెళ్లే రహదారి విస్తరణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రహదారి ఏర్పాటు పనులపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ..ఛే నంబరు ఫ్లై ఓవర్ నిర్మాణంలో భాగంగా ట్రాఫిక్ను మళ్లించేందుకు ముందుగా అలీకేఫ్ చౌరస్తా నుంచి నాగోల్ వరకు ప్రత్యామ్నాయ రోడ్డు వేయాలని అనుకున్నామన్నారు. కానీ ప్రస్తుతం ప్రత్యామ్నాయ రహదారి మాత్రమే కాకుండా భవిష్యత్తు ట్రాఫిక్ అవసరాలను దృష్టితో ఉంచుకొని రహదారిని 120 ఫీట్ల వెడల్పులో ఏర్పాటు చేస్తామన్నారు.
ఇందుకు సంబంధించి అవసరమైన స్థలాన్ని సేకరించేందుకు ఆయా స్థలాల యజమానులతో కూడా చర్చించామన్నారు. రహదారి విస్తరణ పూర్తి అయితే గోల్నాక చౌరస్తా నుంచి అలీకేఫ్ మీదుగా నాగోల్, నాగోల్ నుంచి గోల్నాక ,చౌరస్తా వరకు దూర భారం తగ్గనుందన్నారు. దీంతో దాదాపు ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
రహదారి విస్తరణ అవసరమైన చర్యలు యుద్ధప్రాతిపదికన తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ ప్లానర్ రంజిత్, సీఈ సరోజరాణి, ఈఈ విజయ్కుమార్, డీఈ రాజారావు, పలు విభాగాల అధికారులు ప్రవీణ్, శ్రీనివాస్, శ్రీలత, సూరజ్, గోపాల్, రాజు, మహేష్రాజు, రాము, శంకర్, సువర్ణతో పాటు స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.