కేంద్ర ప్రభుత్వానికి వడ్ల సెగ తగిలేలా పల్లె, పట్టణాల్లో గులాబీదళం కదం తొక్కింది. యాసంగి వడ్ల కొనుగోళ్ల విషయంలో బీజేపీ సర్కారు తీరుపై ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. కర్షకలోకం భారీ సంఖ్యలో కదిలిరాగా.. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. మున్సిపాలిటీల్లో బైక్ ర్యాలీలతో హోరెత్తించగా.. ప్రతి ఇంటిపై నల్లాజెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. కేంద్రం బుద్ధి మార్చాలని బర్రెకు వినతిపత్రం ఇవ్వగా.. ఎండ్లబండి నడిపి నిరసన తెలిపారు. నిర్మల్ పట్టణంలో అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి.. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ సుమన్ బైక్ ర్యాలీలతో హోరెత్తించారు. ఆందోళన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు తమ ఇండ్లపై నల్ల జెండాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి, విప్ మాట్లాడుతూ.. కేంద్రం మొండి వైఖరి విడనాడి వడ్లు కొనుగోలు చేయాలని, కొనేదాక ఉద్యమిస్తామని హెచ్చరించారు.
– ఆదిలాబాద్, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
రాష్ట్రంలో పండించిన వరి కొనేదాకా ఉద్యమిస్తామని ప్రజాప్రతి నిధులు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ఊరూరా నల్లజెండాలను ఇండ్లపై పెట్టుకొని నిరసన తెలిపారు. బైక్ ర్యాలీలు తీశారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు. నిర్మల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, మంచిర్యాల జిల్లా చెన్నూర్లో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఆయా చోట్ల ఎమ్మెల్యేలు జోగు రామన్న, రేఖానాయక్, నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, ఆత్రం సక్కు, జడ్పీ చైర్మన్లు పాల్గొన్నారు.
ఆదిలాబాద్, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన రెండో విడుత ఆందోళనలు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఉధృతంగా కొనసాగుతున్నాయి. రెండు జిల్లాల్లో మంత్రి, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతోపాటు రైతులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు నిరసనగా శుక్రవారం రైతులు పల్లె, పట్టణం అనే తేడా లేకుండా తమ ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేశారు. మోదీ సర్కారు తీరును ఎండగడుతూ నినాదాలు చేశారు. నిర్మల్లో రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పూసాయిలో, మావలలో ఎమ్మెల్యే జోగు రామన్న, ఉట్నూర్లో జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్లు నల్లజెండాలు ఎగురవేశారు. నిర్మల్లో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఖానాపూర్లో ఎమ్మెల్యే రేఖానాయక్, భైంసాలో మథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డిలు నల్లాజెండాలతో ర్యాలీ నిర్వహించారు.
నిబంధనల ప్రకారం వడ్లను కొనుగోలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నదని మంత్రి అల్లోల మండిపడ్డారు. వడ్లను కొనుగోలు చేయాలంటూ ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర మంత్రులను కేంద్ర ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి గోయల్ మీ రాష్ట్ర ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయమని అవమానకరంగా మాట్లాడరని తెలిపారు. కేంద్రం వడ్లను కొనుగోలు చేసేంత వరకు ఆందోళను కొనసాగుతాయ న్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో వ్యవసాయం పండుగలా మారిందని నిబంధనల ప్రకారం వడ్లను కొనుగోలు చేయాల్సిన కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని అంటున్నారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టే ఆందోళనకు తాము అండగా ఉంటామని రైతులు తెలిపారు.