ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్, మే 15 : కాగజ్నగర్ పట్టణానికి చెందిన బూర్ల మహేశ్ ఆనందిత దంపతుల కూతురు అనన్య భార్గవి (5) తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటున్నది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అబ్బుర పరిచే మాటలతో తోటివారిని మంత్రముగ్ధుల్ని చేస్తున్నది. తల్లి నేర్పిన పద్యాలు, పాటలు, శ్లోకాలు, నీతి కథలు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని, తిరిగి క్లాస్ రూములో తన తోటి పిల్లలకు చెబుతూ ఔరా అనిపించుకుంటున్నది.
ఎల్కేజీలోనే దేశంలోని అన్ని రాష్ర్టాలు, రాజధానుల పేర్లు, జాతీయ, రాష్ట్ర చిహ్నాలు, జాతీయ గీతం, గేయం, రాష్ట్ర గీతం, 15కు పైగా వేమన పద్యాలు, ఊర్మిళా దేవి నిద్ర గేయం, శ్రీ శ్రీ రచించిన శైశవ గీతి, తెలుగు నెలలు, లింగాష్టకం, హిందీ, ఆంగ్లం రైమ్స్ను అనర్గళంగా చెబుతూ శభాష్ అనిపించుకుంటున్నది. పదో తరగతి పద్యాలను కూడా ఈజీగా చెప్పేస్తూ ప్రశంసలు పొందుతున్నది. తాతయ్య, అమ్మమ్మ చెప్పే శ్లోకాలు, నీతి కథలు నేర్చుకుంటూ, వాటిని యూట్యూబ్ చానల్ ద్వారా మరికొందరికీ తెలియజేస్తూ చిన్న వయస్సులోనే ప్రతిభ చాటుతున్నది. తాను నేర్చుకున్న ప్రతి విషయాన్నీ బ్లాక్బోర్డుపై ఎలాంటి జంకు లేకుండా చెబుతూ ఆదర్శంగా నిలుస్తున్నది.
ఎల్కేజీ చదువుతున్న ఈ చిన్నారి.. తన పేరిట(అనన్య భార్గవి) ఓ యూట్యూబ్ చానల్ను కూడా నడుపుతున్నది. ఇందులో తన స్నేహితులు, ఇతర పిల్లలకు ఉపయోగపడే విధంగా పాఠాలు, జాతీయ చిహ్నాలు, గేయాలు, పద్యాలు, సుమతి శతక పద్యాలను పెడుతున్నది. ఇది తన తోటి పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అనన్య ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించడంలో తల్లిదండ్రులు విజయం సాధించారు. అనన్యను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తామని ఆ తల్లిదండ్రులు చెబుతున్నారు.