మంచిర్యాల జిల్లాలో పలువురు రైతులు సాగులో వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం, కేవీకే శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారుల సూచనలతో ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. సమృద్ధిగా నీరు లభిస్తుండడంతో, పంట క్షేత్రాలను ప్రయోగశాలలుగా మారుస్తున్నారు. ఈ యాసంగిలోనూ 40 ఎకరాల్లో కాటన్ను పండించగా, ఎకరాకు 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ యేడాది మార్కెట్లో పత్తి ధర క్వింటాల్కు రూ.13 వేలు దాటగా, రానున్న రోజుల్లో మరింత ధర రానుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మంచిర్యాల, మే 15(నమస్తే తెలంగాణ): వాణిజ్య పంటల్లో పత్తి ప్రధానమైనది. ఈ యేడు రికార్డు స్థాయి ధర పలికింది. రూ.12 వేలకు క్వింటాల్ అమ్ముడుపోయింది. వరికి బదులుగా ఇతర పంటలు వేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సూచనలతో రైతులు ఆ దిశగా దృష్టి పెట్టారు. కేవీకే శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు సూచనలి చ్చారు. కొంతమంది రైతులు తమంతట తామే వేసవిలో హైబ్రిడ్ పత్తి విత్తనాలు తీసుకొచ్చి వేసుకున్నారు. ఈ నేపథ్యంలో వారి పంట పొలాలను సంబంధిత అధికారులు ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
యాసంగిలో తమిళ నాడు రాష్ట్రంలో, ఏపీలోని ఒంగోలు, నెల్లూరు ప్రాంతంలో కచ్చితంగా యాసంగిలో పత్తి పంట వేసుకుంటారు. వారికి దిగుబడి కూడా సుమారు 7 నుంచి 11 క్వింటాళ్ల వరకు వస్తున్నది. మంచిర్యాల జిల్లా గోదావరి పరీవాహక ప్రాంతం యాసంగి పత్తి పంట సాగుకు అనుకూలంగా ఉంది. పత్తి పంటలో ప్రధానమైన కాయలు ఒక్కో మొక్కకు దాదాపుగా 25 నుంచి 30 వస్తాయి. పంట సాంద్రత దాదాపు ఎకరానికి ఏడు వేల నుంచి 7,500 మొక్కలు వస్తాయి. కాయ నుంచి సుమారు 4 గ్రాముల పత్తి వస్తుండడంతో 6 నుంచి 7 క్వింటాళ్ల వరకు దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పత్తి రూ. 7 వేలకు క్వింటాల్ పోయినా దాదాపు ఎకరానికి రైతుకు రూ.50 నుంచి 60 వేల వరకు, ఖర్చులు పోను రూ.30 వేల వరకు మిగిలే అవకాశం ఉంది.
చెన్నూర్తో పాటు లక్షెట్టి పేట మండలంలో ఈ యేడు సుమారు 40 ఎకరాల్లో యాసంగి పత్తిని సాగు చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ప్రస్తుతం డిమాండ్ ఉంది. రానున్న రెండేళ్లు ఇదే ధర వచ్చే అవకాశం ఉంది. చెన్నూర్లోని సమ్మయ్య వరి పొలంలో యాసంగి పత్తిని వేశారు. కొద్దిపాటి వ్యవసాయ పద్ధతులు పాటించి, కలుపు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే దిగుబడి కూడా దాదాపు 10 క్వింటాళ్ల వరకు వచ్చే అవకాశం ఉంది. సమ్మయ్య 14 ఎకరాల్లో పత్తి పంట వేశారు.
మా అక్కెపల్లి గ్రామంలో కొందరు రైతులు యాసంగిలో దూది పెట్టిన్రు. సర్కారోళ్లు ఇతర పంటల మీద శ్రద్ధ పెట్టుమని చెప్పిన్రు. మరోదిక్కు వడ్లు కొనబోమని కేంద్రం పెద్ద పంచాయితీ పెట్టే. అందుకే మా ఊర్ల కాయిత రమేశ్, సుధాకర్, బత్తుల సమ్మయ్యతో పాటు ఇంకొందరు పత్తి పంట వేసిన్రు. కాయలు, పంట బాగుంది. అధికారులు కూడా పంట మంచిగున్నదన్నరు. ఇప్పుడు మంచి పంట వస్తే, వచ్చే యాసంగిలో మరికొందరు పత్తే పెడుతరు.
– పెద్దింటి రాజన్న, మాజీ సర్పంచ్, అక్కెపల్లి గ్రామం, చెన్నూర్ మండలం.
వరి కాకుండా ఇతర పంటలు వేసుకోవాలని అధికారులు చెప్పిన్రు. గుంటూరు, నెల్లూరులో సమ్మర్లో పత్తి వేయడం చూసిన. ఈ ఆలోచనతో ఏవో మహేందర్ సారును కలిసిన. ఆయన చెప్పిన సూచనలతో సాగు చేస్తున్న. నాకున్న రెండెకరాల్లో జనవరిలో పత్తి వేసిన. నడుం వరకు చెట్లు పెరిగినయ్. 30 నుంచి 35 వరకు కాయలు ఉన్నయ్. సుమారు 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తదని పంటను చూసిన అధికారులు అంటున్నరు. ప్రస్తుత ధరను చూసుకుంటే ఎకరాకు రూ.లక్షా 60 వేల వరకు లాభం వస్తుందని అనుకుంటున్న. మందులు, కూలీలు, పిచికారీ, ఇతరాలతో కలిపి రూ.30 వేల వరకు ఖర్చయ్యింది.
-సుధాకర్, చింతలపల్లి గ్రామం, చెన్నూర్ మండలం
ఈ సారి యాసంగిలో కొందరు రైతులు పత్తి సాగు చేస్తున్నారు. వ్యవసాయశాఖాధికారు లు, రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు పత్తి పెట్టారు. చెన్నూర్, జైపూర్, లక్షెట్టిపేట మండలాల్లో వేశారు. యాసంగిలో కాటన్ లాభదాయకమైన పంట. దిగుబడి ఆశాజన కంగా ఉంటుంది. జిల్లాలో పత్తి పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించాం. పత్తి పంటలో ప్రధానమైన కాయలు ఒక్కో మొక్కకు దాదాపుగా 25 నుంచి 30 వస్తున్నాయి. అంటే ఎకరాకు సుమారు 6 నుంచి 7 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇది రైతులకు లాభమే.
– డా.రాజేశ్వర్ నాయక్, ప్రధాన శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, బెల్లంపల్లి
యాసంగిలో పత్తి కొనబోమని కేంద్రం తెగేసి చెప్పింది. దీంతో ఇతర పంటల వైపు దృష్టి సారించాలని ముఖ్య మంత్రి కేసీఆర్ సూచించారు. ఇతర రైతులకు మార్గద ర్శకంగా ఉండాలని, ప్రయోగాత్మకంగా వరికి బదులుగా 14 ఎకరాల్లో కాటన్ వేసిన. పంట బాగుంది. ఎకరాకు రూ.30 వేల వరకు ఖర్చయ్యింది. దిగుబడి మంచిగ వస్తుందని ఆశిస్తున్న. చాలా మంది రైతులు సలహాలు, సూచనలు అడుగుతున్నరు.
– బత్తుల సమ్మయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, చెన్నూర్