వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. డ్రైవర్ నిర్లక్ష్యంతో ట్రాక్టర్ కింద పడుకున్న ఓ యువకుడు మృతిచెందాడు. రాత్రిపూట విధులు ముగించుకొని ఇంటికి వస్తుండగా.. బర్రెను ఢీకొని ఒకరు, బంధువుల ఇంటికి వెళ్లి వస్తూ మరొకరు మృతిచెందారు.
గుడిహత్నూర్, మే 12 : పని ముగించుకొని బైక్పై ఇంటికి వస్తున్న క్రమంలో బర్రెను ఢీకొన్న ఘటనలో ఇచ్చోడకు చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, ఎస్ఐ ప్రవీణ్ తెలిపిన వివరాల మేరకు.. ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన కేంద్రె వికాస్(22) ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ గ్రామంలో మెడికల్ షాపు నడిపేవాడు.
రోజు మాదిరిగానే బుధవారం రాత్రి పనులు ముగించుకొని బైక్పై ఇంటికి వస్తున్నాడు. గుడిహత్నూర్ మండలం తోషం గ్రామ సమీపంలోని తోషంతండా గ్రామానికి వెళ్లే రోడ్డు వద్ద బర్రెను ఢీకొన్నాడు. ఈ ఘటనలో వికాస్కు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అతన్ని జిల్లా కేంద్రంలోని రిమ్స్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్ల సలహా మేరకు హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి మరింత విషమించడంతో గురువారం ఉదయం మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఎదులాపురం, మే 12 : ఓ డ్రైవర్ నిర్లక్ష్యంతో నిండుప్రాణం బలైంది. అలిసిపోయి ట్రాక్టర్ కింద నిద్రిస్తున్న యువకున్ని గమనించని డ్రైవర్.. వాహనాన్ని ముందుకు కదిలించడంతో తల పగిలి యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం విషాదాన్ని నింపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని గాంధీనగర్కు చెందిన రాజు(25) కూలినాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఇదే క్రమంలో తిర్పెల్లి గ్యాస్ ఏజెన్సీ ప్రాంతంలో ఓ ట్రాక్టర్ను నిలిపి ఉంచారు. ఎండకు అలిసిపోయిన రాజు ట్రాక్టర్ కింద నిద్రిస్తున్నాడు. ఇది గమనించని సదరు ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ను తీసే క్రమంలో దానికింద ఉన్న రాజుపై నుంచి టైర్లు పోయాయి. దీంతో ఆయన తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా.. రాజు తల్లి ఐదు రోజుల క్రితమే చనిపోయిందని, ఇప్పుడు రాజు అనుకోని ప్రమాదంలో మృతిచెందడం ఆ కుటుంబంలో విషాదం నింపింది.
సోన్, మే 12 : నిర్మల్ మండలంలోని వెంగ్వాపేట్ గ్రామానికి చెందిన పిట్ల రాజు (32) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజు నిజామాబాద్ జిల్లాలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. బుధవారం రాత్రి దూదిగాం వద్దకు రాగానే బైక్పై నుంచి కిందపడడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి.
వెంటనే ఈయనను అంబులెన్స్లో నిర్మల్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం మృతి చెందాడు. రాజుకు భార్యతో పాటు కుమారుడు, కూతురు ఉన్నారు. కాగా.. నిజామాబాద్ జిల్లాలో ఉన్న బంధువుల్లో ఇటీవల ఒకరు మృతి చెందగా.. దినకర్మకు హాజరై తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.