చార్మినార్ : నగరంలోని జూ పార్క్లో గురువారం రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పలు అభివృద్ది పర్చిన ఎన్క్లోజర్లను ప్రారంభించారు. జూలో కొత్తగా ఏర్పాటు చేసిన పక్షుల ప్రపంచంతోపాటు కొత్తగా అందుబాటులోకి తెచ్చిన వైల్డ్ డాగ్లను సందర్శకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సందర్శకులను అలరించడానికి జూ పార్కును మరింతగా ముస్తాబు చేసినట్టు తెలిపారు. గురువారం జూ పార్క్లో నూతనంగా తీర్చిదిద్దిన పారెట్ వరల్డ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ జూ పార్క్ నగర సిగలో మకుటాయమానంగా ఒదిగిపోయిందన్నారు.
దానికి మరింత వన్నె చేకూర్చడానికి జూ పార్క్ను మరింత సుందరంగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నాల్లో పారెట్ వరల్డ్ ఒకటని తెలిపారు. కొత్తగా రూపాంతరం చెందిన ఈ గ్యాలరీలో 36 ఎన్క్లోజర్లను ఏర్పాటు చేశారు. పక్షుల ప్రపంచంలో రంగు రంగుల పూదోటలతో పాటు పక్షులు కిలకిల రావాలతో స్వాగతం పలుకుతాయి.
దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చూడముచ్చటైన పక్షులతో పాటు ఆస్ట్రేలియా, ఆఫ్రికా, సౌత్ ఆమెరికా దేశాల నుండి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్న పక్షులు సందర్శకులను మరో లోకంలో విహరింపజేస్తాయని తెలిపారు. ఇందులో మొత్తం 60 జంటలతో 680 పక్షులు పర్యాటకులను అలరించనున్నాయని తెలిపారు.
పక్షుల ప్రపంచాన్ని 1 కోటి 33 లక్షల నిధులతో అద్బుతమైన పక్షుల రాజ్యాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం సఫారీ పార్క్లో ప్రయాణించడానికి నూతంగా అందుబాటులోకి తీసుకువచ్చిన ఏసీ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.
అలాగే కర్నాటక రాష్ట్రంలోని మంగళూరు నుండి తీసుకువచ్చిన వైల్డ్ డాగ్లను ఎన్క్లోజర్లోకి విడుదల చేశారు. పర్యాటకుల రక్షణ కోసం జూ పార్క్లో200 సీసీ కెమెరాలను అందుబాటులోకి తీసుకువచ్చామని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు.