నల్లకుంట రత్నానగర్ వద్ద రక్షణ గోడ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
అంబర్పేట : హైదరాబాద్ నగరంలో నాలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందులో భాగంగా మొదటి దశలో రూ.858 కోట్లతో నాలాల అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
హుస్సేన్సాగర్ వరదనీటి నాలాకు రక్షణ గోడ నిర్మాణానికి నల్లకుంట రత్నానగర్ వద్ద రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ సురభివాణి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్గౌడ్లతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు.
స్టాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా రక్షణగోడ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ గత ఏడాది హైదరాబాద్లో ఆకాశం చిల్లులు పడినట్టు కుంభవృష్టి వర్షం పడినప్పుడు మొత్తం హుస్సేన్సాగర్ సర్ప్లస్ నాలా కింది నుంచి మూసీ వరకు పొంగి నల్లకుంట, అంబర్పేట, అశోక్నగర్, కవాడిగూడ తదితర ప్రాంతాల్లో ఇండ్లలోకి వరద చేరి ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు.
ఆ సమయంలోనే హుస్సేన్సాగర్ దిగువ నుంచి మూసీ వరకు రెండు వైపుల రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయాలని స్థానికులు కోరారన్నారు. నాలా మొత్తం రెండు వైపులా 12 కిలో మీటర్ల పొడవునా నాలా నిర్మాణం చేపట్టామన్నారు. నాలాతో ఈ ప్రాంతంలో ఉండే వేలాది మందికి ఉపశమనం కలుగుతుందని చెప్పారు.
నాలాల అభివృద్ధికి, హైదరాబాద్ మహానగరానికి శాశ్వతంగా చికాకు పోవడానికి నాలాలను ఒక వ్యూహాత్మకంగా ఒక పద్దతి ప్రకారం దశలవారీగా అభివృద్ధి చేసేందుకు స్ట్రాటెజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాంను తీసుకోవడం జరిగిందన్నారు.
మహానగరం హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందాలంటే ఇప్పటికే కేసీఆర్ నాయకత్వంలో మంచినీటి సమస్య పరిష్కారమైందని, ఆయన నాయకత్వంలోనే రహదారులు అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుందని, అలాగే నాలాల సమస్య కూడా మన ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు.
జూన్ నాటికి రక్షణ గోడ పనులు పూర్తి
ఈ సందర్భంగా వచ్చే జూన్ నాటికి రక్షణ గోడ పనులు పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. నాలాలపై ఉంటున్న వారికి నష్టం లేకుండా పనులు చేస్తామన్నారు. నాలా రక్షణ గోడ నిర్మాణ పనులకు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు తమ సహకారం అందజేస్తారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోత శ్రీలతశోభన్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్కుమార్, చీఫ్ ఇంజనీర్ జియావుద్దీన్, వసంత, ఇతర అధికారులు, కార్పొరేటర్లు దూసరి లావణ్యశ్రీనివాస్గౌడ్, ఇ.విజయ్కుమార్గౌడ్, మాజీ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దిడ్డి రాంబాబు, గరిగంటి శ్రీదేవిరమేష్, కె.పద్మావతి, పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.