మాదాపూర్ : మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్యానగర్లో రైల్వే శాఖ ఆధీనంలో ఉన్నటువంటి స్థలంలో నూతనంగా నిర్మించాల్సిన డ్రైనేజీ ఔట్ లెట్, బస్తీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను చెవెళ్ళ ఎంపీ, డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి, స్థానిక కార్పొరేటర్ వి. జగదీశ్వర్గౌడ్తో పాటు జోనల్ కమిషనర్ ప్రియాంక ఆలా, జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా చెవెళ్ళ ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ … 50 వేల జనాభా కలిగినటువంటి ఆదిత్యానగర్ బస్తీలో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని అన్నారు. ఇందులో భాగంగా సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను 90 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు.
ఆదిత్యానగర్ బస్తీ హఫీజ్పేట్ రైల్వే స్టేషన్కు ఆనుకొని ఉండటం వలన రైల్వే పరిధి నుండి డ్రైనేజీ ఔట్లెట్ నిర్మాణం చేపట్టి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం జరిగిందని అన్నారు. అనంతరం కార్పొరేటర్ వి. జగదీశ్వర్గౌడ్ మాట్లాడుతూ … రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మాదాపూర్ డివిజన్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని అన్నారు.
ఇప్పటికే పలు కాలనీల్లో యూజీడి, సీసీ రోడ్లతో పాటు వరదనీటి కాలువ పనులను పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తు మరిన్ని నిధులను వెచ్చించి అభివృద్ధి పనులను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు.
చెవెళ్ళ ఎంపీ రంజిత్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ మాల్యా దృష్టికి డ్రైనేజీ ఔట్లెట్ సమస్యను తీసుకువెళ్ళడం జరిగిందని అన్నారు. వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి స్థానిక ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు ఈఈ శ్రీకాంతి, డీఈ స్రవంతి, ఏఈ ప్రశాంత్, జలమండలి మేనేజర్ ఇల్వర్తిలతో పాటు స్థానిక పార్టీ నాయకులు మాదాపూన్ డివిజన్ జనరల్ సెక్రటరీ సాంబశివరావు, నల్లా సంజీవరెడ్డి, సయ్యద్ గౌస్, సర్వర్, సుభాష్చంద్రబోస్ నగర్ బస్తీ అధ్యక్షులు ముక్తార్, కృష్ణ కాలనీ టీఆర్ఎస్ బస్తీ అధ్యక్షుడు కృష్ణ యాదవ్, రహీం, ఖాసీం, లియాకత్, బాబూమియా తదితరులు పాల్గొన్నారు.