సిద్దిపేట, జనవరి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతీ రైతు వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో రైతుబంధు డబ్బులు జమ చేసింది. రైతుబంధు సంబరాలను పది రోజుల పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఊరూవాడల్లో రైతులోకం జరుపుకున్నది. గ్రామాల్లో వివిధ రకాల పోటీలు నిర్వహించి, హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభీషేకాలు జరిపారు. పెట్టుబడి సాయంతో రైతు సావుకార్ల వద్దకు వెళ్లకుండానే వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. రైతులు తమకు వచ్చిన రైతుబంధు డబ్బులను సద్వినియోగం చేసుకున్నారు. యాసంగిలో సాగు పెట్టుబడుల కోసం ఎకరాకు రూ.5వేల చొప్పున సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో కలిపి 8,47,713 మంది రైతులకు గాను రూ. 908.98 కోట్లు రైతుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో జమ చేసింది. రైతులు అడగకముందే రైతుబంధు ఇయ్యడంతో రైతులు ఖుషీ..ఖుషీగా ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధుతో కొంత మంది రైతులు వ్యవసాయ బావులకు, మరికొంత మంది రైతులు సాగు కోసం, వ్యవసాయ పరికరాలకు ఇలా వివిధ రకాలుగా రైతుబంధు డబ్బును వినియోగించుకుంటున్నారు. ప్రతి రూపాయిని సాగు కోసం ఖర్చు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా రైతులకు వసతులను కల్పించడంతో రైతులు సాగును సంబురంగా చేసుకుంటున్నారు. పుష్కలంగా సాగు నీరు అందివ్వడంతో రైతులు ప్రతీ గుంటను సాగులోకి తెచ్చా రు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుం టే ఇది గిట్టని బీజేపీ, కాంగ్రెస్ అనవసరంగా రాజకీయాలు చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుడడంతో ఆ పార్టీలను రైతులు ఛీ కొడుతున్నారు.