మాస్కులు ధరించండి..భౌతిక దూరం పాటించండి
ప్రజలకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సూచన
కొవిడ్ చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు ఆదేశం
ప్రైవేటులో కరోనా పేరిట దోపిడీ చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరిక
నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడిన మంత్రి.. వ్యాక్సినేషన్ పైనా ఆరా
నిజామాబాద్, ఏప్రిల్ 9, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఉభయ జిల్లాల యంత్రాంగాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి శుక్రవారం ఆయన ఇరు జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖాన సూపరింటెండెంట్తోనూ మాట్లాడి కరోనా చికిత్సకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. కరోనా చికిత్స పేరిట దోపిడీ చేసే ప్రైవేటు దవాఖానలపై కఠిన చర్యలుంటాయని మంత్రి ఈ సందర్భంగా హెచ్చరించారు. తప్పనిసరై బయటికి వచ్చేవారు బాధ్యతగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని మంత్రి సూచించారు.
కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఉభయ జిల్లాల యంత్రాంగాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి ఫోన్లో ఇరు జిల్లాల కలెక్టర్లతో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖాన సూపరింటెండెంట్తోనూ మాట్లాడి కరోనా చికిత్సకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ప్రైవేటు దవాఖానల్లో కరోనా చికిత్స పేరిట దోపిడీ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. ప్రజలెవ్వరైనా ప్రైవేటు దవాఖానల్లో ఇష్టానుసారంగా వేసే బిల్లులపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయొచ్చని మంత్రి సూచించారు. బాధ్యతగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి బయటికి రావాలని చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగానే కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతోందన్నారు. క్షేత్ర స్థాయిలో కరోనా నివారణ, నియంత్రణకు గట్టి చర్యలు చేపట్టాలని కలెక్టర్లు నారాయణ రెడ్డి, డా.ఎ.శరత్కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
అప్రమత్తంగా ఉండండి..
కొవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మంత్రి ప్రశాంత్రెడ్డి కలెక్టర్లకు సూచించారు. ఉభయ జిల్లాలోని బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఏరియా దవాఖానల్లో సరిపడా సదుపాయాలు కల్పించాలని కలెక్టర్లు నారాయణ రెడ్డి, డా.ఎ.శరత్కు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా రోగులకు అవసరమయ్యే చికిత్సను బట్టి ముందు ఏరియా దవాఖానలో చూడాలని, అత్యవసరం అయితే జిల్లా దవాఖానలో చికిత్స అందించాలని సూచించారు. ఏ పేషెంట్కి ఎక్కడ చికిత్స అందించాలో ముందే అవగాహనకు వచ్చేలా ఒక ప్రొటోకాల్ పాటించాలని చెప్పారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖాన జనరల్ ఓపీని తగ్గించి కొవిడ్ పేషెంట్లకు చికిత్సకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని, అదే విధంగా సమాంతరంగా కొవిడ్ వ్యాక్సినేషన్ జరిగేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు.
ప్రైవేటులో దోపిడీ చేస్తే చర్యలు..
ఆర్థిక స్థోమత కలిగి ప్రైవేటు దవాఖానలో చికిత్స తీసుకోవాలనుకొనే వారికి ఆ వెసులుబాటు కల్పించాలని కలెక్టర్లకు మంత్రి సూచించారు. ప్రైవేటు దవాఖానలో ఇబ్బడిముబ్బడిగా బిల్లులు వేయొద్దని.. ఒక వేళ దోపిడీ చేస్తున్నట్లు ప్రభుత్వ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జీజీహెచ్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ కొరత ఉన్నదని సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ మంత్రికి చెప్పగా తాత్కాలికంగా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ను నియమించుకునే అవకాశం సూపరింటెండెంట్కు ఇవ్వాలని కలెక్టర్ నారాయణ రెడ్డికి మంత్రి సూచించారు. కరోనా ప్రబలుతున్న దృష్ట్యా ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజలు కూడా విధిగా స్వీయ నియంత్రణ పాటిస్తూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని మంత్రి ప్రజలకు విన్నవించారు.
436 కరోనా కేసులు
విద్యానగర్/ఖలీల్వాడి, ఏప్రిల్ 9: ఉమ్మడి జిల్లాలో శుక్రవారం 436 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.కామారెడ్డి జిల్లావ్యాప్తంగా 2,478 మందికి పరీక్షలు నిర్వహించగా.. 300 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని జిల్లా నోడల్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15,483కి చేరిందన్నారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 136 కేసులు నమోదయ్యాయని డీఎంహెచ్వో సుదర్శనం తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 21,420 కేసులు నమోదయ్యాయని తెలిపారు. మద్నూర్ మండలం చిన్న ఎక్లారాలో మూడు రోజుల్లోనే మొత్తం 122 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లాలోని 30 కేంద్రాల్లో శుక్రవారం 4,940 మందికి కొవిడ్ టీకా వేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 70,586 మందికి టీకా పంపిణీ చేశామని చెప్పారు. నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా 2250 మందికి కరోనా టీకా వేసినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి
బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న ముగ్గురు మహిళలు అరెస్టు
ఐపీఎల్.. పవర్ప్లేలో ఆర్సీబీ 46/2