సిద్దిపేట అర్బన్, జనవరి 19 : అనేక అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ర్టాల కంటే అభివృద్ధిలో ముందు వరుసలో ఉందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడు గుట్టపై జరిగిన నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. అంతకు ముందు చిన్నకోడూరు టీఆర్ఎస్వీ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకొని ప్రకటించారు. గొంతు పెద్దగా చేసుకొని ఒక అబద్ధ్దాన్ని వంద సార్లు చెప్పడం, గ్లోబెల్స్ ప్రచారం చేస్తూ అబద్ధ్దాన్ని నిజమని నమ్మేలా బీజేపీ ప్రచారం సాగిస్తున్నదని మంత్రి ఆరోపించారు. ఫేక్ వాట్సాప్ యూనివర్సిటీల ద్వారా ఫేక్ ప్రచారాలు చేస్తూ ప్రజలను బీజేపీ మభ్య పెట్టి లబ్ధ్ది పొందే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. 317 జీవోను బండి సంజయ్ విమర్శించడం అంటే వారి బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టడంతో పాటు ప్రధాని, రాష్ట్రపతిని తప్పుపట్టడమే అన్నారు. అంతే కాకుండా నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టడమే అన్నారు. 317 జీవోతో 85శాతం ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని, రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు జరిగేదని, రాష్ట్రపతి అంటే కేంద్రం అన్నట్లే అన్నారు. ఆ జీవో రద్దు చేయాలని దీక్ష చేస్తున్న బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టడమే కదా అన్నారు. అందరూ ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్కే వస్తానంటే ఆ జిల్లా ఉద్యోగులకు నష్టం చేసినట్లే కదా అని అన్నారు. దీనికి బండి సంజయ్ దీనికి నేరుగా సమాధా నం చెప్పాలని డిమాండ్ చేశారు. పద్ధతి ప్రకారం కేటాయింపులు జరగకపోతే ఉద్యోగ సంఘాలు ఊరుకుంటాయా.. రాష్ట్రపతి ఉత్తర్వులు లోబడి కేటాయింపులు చేస్తున్నాం కాబట్టే ఉద్యోగ సం ఘాలు ప్రభుత్వాన్ని తప్పుబట్టడం లేదన్నారు. 317 జీవో ద్వారా అన్ని జిల్లాలకు న్యాయం జరిగి నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. దీన్ని అడ్డుకోవడమంటే నిరుద్యోగుల నోట్లో మటి కొట్టడమే అన్నారు. రాష్ట్రంలో ఈ ఏడేండ్లలో లక్షా 30 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు. దొంగే దొంగా అన్న చందంగా బీజేపీ తీరు ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. ముందుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 317 జీవో ప్రకారం కేటాయింపులు జరిగాక, ఖాళీగా ఉన్న మరో 60 నుంచి 70 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేస్తామన్నారు. 317 జీవో స్థానికులకే 95శాతం ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి హరీశ్రావు అన్నారు.