ప్రతి గింజనూ కొంటామని హామీ
ఊరూరా కొనుగోలు కేంద్రాలు
రాజన్నసిరిసిల్ల జిల్లాలో ప్రారంభం
జిల్లావ్యాప్తంగా 236 సెంటర్లు
ఊపందుకున్న ధాన్యం సేకరణ
వెంటవెంటనే అన్నదాత ఖాతాల్లో నగదు జమ
3.50 లక్షల టన్నుల సేకరణ లక్ష్యం
రైతులకు రూ.686 కోట్ల చెల్లింపులు
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): నల్లచట్టాలు తెచ్చి, దొడ్డు వడ్లు కొనబోమని కేంద్రం రైతాంగంపై కక్ష చూపుతుంటే ఇందుకు భిన్నంగా కేసీఆర్ సర్కారు మాత్రం రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలతో రక్షనిస్తున్నది.. మోడీ ప్రభుత్వం సహకరించకున్నా పండించిన ప్రతి గింజనూ కొనాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 236 సెంటర్లను ఏర్పాటు చేసి 3.50 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించనున్నది. వెంట వెంటనే ఖాతాల్లో నగదు జమ చేయనుండగా అన్నదాత ఆనందంలో మునిగితేలుతున్నది..
రాష్ట్రం సిద్ధించిన నాటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాతకు అడుగడుగునా అండగా నిలుస్తున్నారు. ఏడాది తిరుగకముందే 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చారు. అనేక సంక్షేమ ఫలాలు అందించారు. అంతేకాకుండా పండించిన ప్రతి పంట గింజనూ మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇటీవల దొడ్డు ధాన్యం కొనుగోలు చేయబోమని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో రైతుల్లో కొంతమేర ఆందోళన నెలకొన్నది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వారికి అండగా నిలిచింది. గతంలో మాదిరిగానే పంట ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టింది. రాజన్నసిరిసిల్ల జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని ఊర్లలో 236 ధాన్యం సెంటర్లు ఏర్పాటు చేసి 3.50 లక్షల మెట్రిక్ ధాన్యాన్ని సేకరిస్తున్నది. ఇప్పటికే చాలాచోట్ల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. మరికొన్ని గ్రామాల్లో త్వరలోనే సెంటర్లను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
సెంటర్లలో సకల సౌకర్యాలు
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సకల సౌకర్యాలు కల్పించాలని ఇటీవల ధాన్యం కొనుగోలుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొన్న ధాన్యాన్ని వెంటవెంటనే తరలించేందుకు వాహనాలను సిద్ధం చేయాలని నిర్దేశించారు. తూకం వేసేందుకు ఎలాక్ట్రానిక్ కాంటాలు, సరిపడా గన్నీ సంచులు అందుబాటులో ఉంచాలన్నారు. కాగా, జిల్లాలో సహకార సంఘాల ఆధ్వర్యంలో 162, ఐకేపీ 58, డీసీఎంఎస్ 7, మెప్మా 2, మార్కెటింగ్ శాఖ 7 కేంద్రాల చొప్పున ఏర్పాటు చేయనున్నది. 87.50లక్షల గన్నీ సంచులు కొనుగోలు చేశారు. టార్పాలిన్లు 6810, తూకం వేసే యంత్రాలు 167, ధాన్యం శుద్ధ్ది యంత్రాలు 681, తేమ శాతం కొలిచే యంత్రాలు 227, ఇంకా ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచుతున్నారు.
ఏ గ్రేడ్ రకానికి రూ. 1960 మద్దతు
రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏగ్రేడు ధాన్యానికి రూ. 1960 మద్దతు ధర ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం కాగా, నవంబర్లో లక్ష, డిసెంబర్లో రెండు లక్షలు, జనవరిలో 70వేల వరకు కేంద్రాలకు ధాన్యం రావచ్చని మార్కెటింగ్ శాఖ అంచనా వేసింది. అయితే 3.50లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు దాదాపుగా రూ. 686 కోట్ల రైతులకు చెల్లించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
పోటెత్తుతున్న ధాన్యం..
ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు దండిగా ధాన్యం తరలివస్తున్నది. రైతులు తెచ్చిన ధాన్యాన్ని ఆరబోసుకుంటున్నారు. తాలు, మట్టిపెళ్లలు లేకుండా యంత్రాలతో శుద్ధి చేసుకుంటున్నారు. అకాల వర్షాల వస్తే తెచ్చిన ధాన్యం తడవకుండా తాటిపత్రిలు సిద్ధం చేసుకున్నారు.
కేసీఆర్ లేకుంటే మా బతుకులు ఆగమే
కేంద్ర ప్రభుత్వం రైతులను నిండా ముంచుతున్నది..దొడ్డు వడ్లు కొనమని చెబుతున్నది. మేము ఏం పాపం చేశాం. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు, రైతబీమా, ఉచిత కరెంటు ఇయ్యబట్టే యవసం నడుత్తున్నది. కేసీఆర్ లేకుంటే మా బతుకులు ఆగమై పోయేవి. ఇప్పుడే కోతకొచ్చిన పంట కొంటామని పెద్ద సార్ సెప్పంగనే పోయిన పాణం లేసచ్చినట్లయింది.