దేవాలయ సంప్రదాయాలపై మాట్లాడడం సరికాదు
ఆలయ ఆచార, సంప్రదాయాలను కాపాడుతాం
బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్న మల్లన్న ఆలయం
మల్లన్నకు బంగారు కీరిటం చేయిస్తాం
అద్భుత కళాఖండంగా కొండపోచమ్మ క్షేత్రం..
రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
కొమురవెల్లి మల్లన్న, కొండపోచమ్మ క్షేత్రాల సందర్శన
చేర్యాల, జనవరి 30 : కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి ఆశీస్సులు, సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషితో తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని, మల్లన్న ఆలయ సంప్రదాయాలు తదితర విషయాలపై ఎక్కడపడితే అక్కడ మాట్లాడడం సరికాదని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నా రు. 3వ ఆదివారం సందర్భంగా మంత్రి తలసాని తన కుటుంబ సభ్యులతో కలిసి కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మల్లన్న ఆశీస్సులు తెలంగాణ రాష్ర్టానికి, సీఎం కేసీఆర్కు నిండుగా ఉండడంతో ఆయన అన్నిరంగాల్లో విజయం సాధిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధి, భక్తుల వసతులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, రాష్ట్రంలో తప్ప దేశంలోనే దేవాలయాల అభివృద్ధికి పాలకులు కృషి చేయడం లేదన్నారు. సీఎం కేసీఆర్ మల్లన్న కల్యాణోత్సవానికి హాజరైనప్పటి నుంచి క్షేత్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నదని, మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి క్షేత్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల వసతులే ప్రధాన లక్ష్యంగా రూ.10కోట్లతో బస్టాండ్ సమీపంలో 50 కాటేజీలను ప్రభుత్వం నిర్మిస్తున్నదని, మహామండప విస్తరణ పనులు సైతం కొనసాగుతున్నాయని, కల్యాణోత్సవం రోజున నిర్ణయించిన విధంగా స్వామి వారికి బంగారు కీరిటం సైతం ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే రూ.4కోట్ల వ్యయంతో ఆలయంలో వెండి తలుపులు ఏర్పాటు చేశామని, భక్తులకు వసతులు కల్పించడంతో దేవాలయం మరింత అభివృద్ధి చెందుతున్నట్లు తెలిపారు. స్వామి వారి ఆలయం సమీపంలోని కొండపై తన సొంత ఖర్చులతో గెస్ట్హౌస్ నిర్మించేందుకు అన్ని ఏర్పాట్లు చేశానని, కొండపైకి రోడ్డు పనులు పూర్తి కాగానే గెస్ట్హౌస్ పనులు ప్రారంభిస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కొమురవెల్లి కొనసాగిన సమయంలో దేవాలయ అభివృద్ధిని నాటి పాలకులు పట్టించుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే కొమురవెల్లి క్షేత్రానికి మహర్దశ పట్టిందని, మల్లన్న క్షేత్రంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతామన్నారు.
భక్తుల మనోభావాలను గౌరవించాలి
మల్లన్న ఆలయంలో పూర్వకాలం నుంచి ఉన్న ఆచార, సంప్రదాయాలు ఎప్పటికి కొనసాగుతాయని విలేకరులు అడిగిన ప్రశ్నలకు మం త్రి సమాధానం ఇచ్చారు. ఎంతో పవిత్రమైన మల్లన్న ఆలయంపై ఎక్కడపడితే అక్కడ మాట్లాడడం సరికాదని, ఆచారాలు, సంప్రదాయాల విషయంలో భక్తులకు ఎన్నో సెంటిమెంట్స్ ఉంటాయనే విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. స్వామివారి ఆలయంలో పూర్వకాలం నుంచి వస్తున్న ఆచార, సంప్రదాయాలతోపాటు భక్తుల మనోభావాలను ప్రభు త్వం కాపాడుతుందన్నారు. ఆలయంలోని సం ప్రదాయాలు, వ్యవహారాలు అధికారులు, పూ జారులు, పరిసర ప్రాంత ప్రజలకు తెలుస్తాయన్నారు. స్వామివారి ఆలయంలో సమ్యసలుంటే దేవాదాయ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ పరిష్కరిస్తుందన్నారు. స్వామివారి భక్తుల మనోభావాలను గౌరవించడంతో పాటు క్షేత్రాన్ని అభివృద్ధి చేయడం, వారికి వసతులు కల్పించడమే తమ ధ్యేయమన్నారు. దేవాలయంపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో బాలాజీ, చైర్మన్ గీస భిక్షపతి, ధర్మకర్తలు, సిబ్బంది ఉన్నారు.
మంత్రిని కలిసిన ముదిరాజ్ నాయకులు
కొమురవెల్లి, జనవరి 30 : కొమురవెల్లి మల్ల న్న దర్శనం అనంతరం కొండపోచమ్మ ఆలయానికి వెళ్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను గురువన్నపేటకు చెందిన ముదిరాజ్ సం ఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిని కలిసిన వారిలో మత్స్యశాఖ గ్రామ అధ్యక్షుడు కనకయ్య, జిల్లా ధనుంజయ్య, నా యకులు తిరుపతి, శ్రీశైలం, సాయిలు, గణేశ్, భాస్కర్, బాలమల్లు, సుధాకర్ ఉన్నారు.