తూప్రాన్ న్యూస్ కాంట్రిబ్యూటర్
నాగరాజు సతీమణి లత
హైదరాబాద్, నమస్తే తెలంగాణ, నవంబర్ 29 : పుట్టెడు దుఖంలో ఉన్న తమకు 5 లక్షల రూపాయలు అందించి ఆదుకున్న నమస్తే తెలంగాణ యాజమాన్యానికి దివంగత తూప్రాన్ విలేకరి నాగరాజు కుటుంబం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపింది. నమస్తే తెలంగాణకు తూప్రాన్ స్థానిక విలేకరిగా పనిచేస్తున్న నాగరాజు ఈ ఏడాది ఆగస్టు 15న ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించారు. కాగా, నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్రావు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చెక్కును సోమవారం నాగరాజు సతీమణి లతకు అందజేశారు. నమస్తే తెలంగాణ యాజమాన్యం చేసిన సాయానికి ఆమె కృతజ్ఞతలు చెప్పింది. ‘నా భర్త నాగరాజు నమస్తే తెలంగాణ స్థానిక కాంట్రిబ్యూర్గా పని చేస్తుండే వాడు. ప్రమాదవశాత్తూ ఆగస్టు 14న రాత్రి చెరువులో పడి మృతి చెందాడు. మా ఆయన దూరం అయిన నాటి నుంచి యాజమాన్యం మాకు అండగా నిలిచింది’ అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తనకు ఇంటర్ చదివే ఇద్దరు కొడుకులున్నారని, కుటుంబ పెద్దదిక్కును కోల్పోయిన తమకు ‘నమస్తే తెలంగాణ’ అండగా నిలిచిందని చెప్పారు. చనిపోయిన రోజునే మాకు రూ.47వేలు అందజేసిందని తెలిపారు. ఇప్పుడు రూ.5లక్షలు అందజేసి తమను ఆదుకున్నదని, సంస్థ అందజేసిన నగదుతో భర్త కోరిక మేరకు ఇంటర్ చదువుతున్న ఇద్దరు కొడుకులను ఉన్నత విద్యావంతులను చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా నాగరాజు పెద్ద కుమారుడు మధు మాట్లాడుతూ అనుకోని స్థితిలో మృతి చెందిన తమ నాన్న ఆశయం మేరకు ఉన్నత చదువులకు సాయం చేస్తామని యాజమాన్యం చెప్పిందని పేర్కొన్నాడు. సంస్థకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెప్పాడు.