కొవిడ్, లాక్డౌన్ నేపథ్యంలో భారీగా పెరిగిన రేషన్ బియ్యం
జూన్, జూలై నెలల్లో కార్డుదారులకు పంపిణీ చేయనున్న ప్రభుత్వం
కరోనా కరువును తీర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం
రేపటి నుంచి రేషన్ దుకాణాలకు పీడీఎస్ బియ్యం సరఫరా
ఖమ్మం, మే 29: కరోనా కారణంగా పేదలు ఆకలితో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. పేదల తినే రేషన్ బియ్యం కోటాను భారీగా పెంచారు. రేషన్ దుకాణాల ద్వారా ఒక్కొక్కరికీ ప్రతి నెలా ఇచ్చే 6 కేజీల బియ్యాన్ని 15 కేజీలకు పెంచారు. ఇవి కూడా ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జూన్, జూలై నెలల్లో వీటిని పంపిణీ చేయాలని శనివారం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ఖమ్మం జిల్లాలో గల 4,05,340 రేషన్ కార్డుల్లోని 11,40,814 మందికి ఈ బియ్యాన్ని అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్కు సంబంధించి 1.55 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని పేదలకు అందచేయనున్నారు.
కుటుంబాలకు ఆసరాగా..
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రభుత్వం ఈ నెల 12 నుంచి లాక్డౌన్ను అమలు చేస్తోంది. దీని వల్ల డైలీవేజ్ వర్కర్లు, రైతు కూలీలు, అసంఘటిత రంగ కార్మికులకు సరైన ఉపాధి లభించడం లేదు. వారు ఇంట్లోనే ఉండడంతో పూట గడవడం కష్టమవుతోంది. నిరుడు కూడా కరోనా కాలంలో సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని పేదలకు మనిషికి పది కిలోల చొప్పున ఉచితగా బియ్యం పంపిణీ చేశారు. నిత్యావసర సరుకుల కోసం రేషన్ కార్డు యజమాని ఖాతాలో రూ.1500 జమ చేశారు.
1,112 రేషన్ దుకాణాలు..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,112 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటికి ప్రతి నెలా 12,49,381 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, 17,573 కిలో పంచదారను పంపిణీ చేస్తున్నారు.
రెండు నెలలు ఉచిత బియ్యం
ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్, జూలై నెలల్లో రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికీ 15 కేజీల చొప్పున ఉచితంగా బియ్యం అందిస్తాం. ఆదివారం నుంచి మండల స్థాయి స్టాక్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్నాం. జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల్లో బియ్యం పంపణీ చేస్తాం.అంత్యోదయ కార్డుదారులకు మాత్రమే పంచదారను అందిస్తున్నాం. ఆహారభద్రత కార్డుదారులకు పంచదార ఇవ్వడం లేదు. జూన్ నెలకు సంబంధించి 1.55 లక్షల క్వింటాళ్ల బియ్యం అందిస్తాం.
-రాజేందర్, డీఎస్వో