రూ.1.50కోట్లు కేటాయింపునకు ప్రభుత్వం ఆమోదం
నేడు చెరువును పరిశీలించనున్న ఎమ్మెల్యే, అధికారుల బృందం
చెరువుకట్ట సుందరీకరణ.. విహారయాత్రకు రెండు బోట్లు
హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 28 : ఇబ్రహీంపట్నం పెద్దచెరువును పర్యాటక కేంద్రంగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈమేరకు రూ.1.50కోట్ల నిధులను కేటాయించడానికి సర్కారు నిర్ణయించింది. ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో నీరు సమృద్ధిగా ఉండటంతో ఈ ప్రాంతం పర్యాటక కేంద్రాన్ని తలపించేలా మారింది. ఇబ్రహీంపట్నం నుంచి శేరిగూడ వరకు సుమారు 4 కిలోమీటర్ల పొడవుగల చెరువుకట్టతో ఉన్న పెద్దచెరువును పర్యాటక కేంద్రంగా మార్చాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఎప్పటినుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎట్టకేలకు పర్యాటక కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం ఆమోదించడంతో ఆ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. నైజాం కాలంలో నిర్మించిన ఈ చెరువు ఒక టీఎంసీ నీటి సామర్థ్యం కలిగి ఉంది. సుమారు 400 ఎకరాల్లో నీటి సామర్థ్యంగల విస్తీర్ణం ఉంది. ఈ చెరువులో పూర్తిస్థాయి నీటిమట్టం 58 అడుగులు కాగా, ప్రస్తుతం 40 అడుగుల మేరకు నీరు చేరింది. దీంతో ఈ ప్రాంతవాసులు ఉదయం, సాయంత్రం వేళల్లో చెరువుకట్టపైకి వెళ్లి సేదతీరుతున్నారు. చెరువును అభివృద్ధి చేస్తే పర్యాటకులను ఆకర్షించేలా ఉంటుందని అధికారులు నిర్ణయానికొచ్చారు.
పర్యాటక కేంద్రంలో భాగంగా చెరువుకట్ట ఇరువైపులా మంచి మొక్కలను నాటడంతోపాటు ఆహ్లాదకర వాతావరణం వచ్చేలా తీర్చిదిద్దాలని అధికారులు నిశ్చయించారు. చెరువుకట్టపై మినీ పార్కులను నెలకొల్పి పర్యాటకులు కూర్చోవడానికి బెంచీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే చెరువుకట్టకు ఇరువైపులా హరితహారంలో భాగంగా అధికారులు పెద్దఎత్తున మొక్కలు నాటారు. మొక్కలు ఏపుగా పెరిగి చెరువుకట్ట పూర్తిగా గ్రీనరీగా మారింది. చెరువుకట్టను మరింత అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి.
చెరువులో విహార యాత్రకు రెండు బోట్లు
ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో నీరు సమృద్ధిగా ఉన్నందున పర్యాటకులు బోట్లో షికారుచేసేందుకు వీలుగా రెండు బోట్లను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఒక బోటులో పర్యాటకులు విహరించేలా, మరో బోట్లో షికారు చేయడంతోపాటు అందులోనే అన్ని వసతులు ఉండేలా పర్యాటకశాఖ ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. చెరువులో కంపచెట్లు అధికంగా ఉండడం వలన నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోనే వీటిని నడిపేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉప్పరిగూడ రోడ్డులోగల పెద్దచెరువు తీరప్రాంతంలో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఒక భవనం నిర్మించి వీటిని అక్కడి నుంచే నడుపాలని అధికారులు భావిస్తున్నారు.
నేడు అధికారుల బృందం పర్యటన
పెద్దచెరువును పర్యాటక కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో బుధవారం పర్యాటక, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి చెరువును పర్యవేక్షించనున్నారు. చెరువుకట్ట సుందరీకరణ పనులతో పాటు చెరువులో బోట్ షికారు చేసేందుకు అనువైన ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయా శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే కిషన్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
త్వరలోనే పర్యాటక కేంద్రంగా ఇబ్రహీంపట్నం పెద్దచెరువు