అబ్దుల్లాపూర్మెట్, నవంబర్ 28 : వరి ధాన్యానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకుంటుందని ధాన్యం కొనుగోలు కేంద్రాల మండల ప్రత్యేక అధికారి రాజేశ్వర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. బాచారం గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళారుల చేతిలో మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. బండరావిరాల, గౌరెల్లి గ్రామాల రైతులు తమ గ్రామాల్లో త్వరలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. వారి వెంట తాసిల్దార్ వెంకటేశ్వర్లు, మండల వ్యవసాయ అధికారి శ్రీఉమా, హయత్నగర్ పీఎస్సీఎస్ చైర్మన్ చామ కృష్ణారెడ్డి, రైతుబంధు సమితి మండల చైర్మన్ కందాళ బలదేవరెడ్డి, సర్పంచ్లు పారంద సంతోష, కవాడి శ్రీనివాస్రెడ్డి, తుడుం మల్లేశ్, ఎంపీటీసీ గ్యార బాలలింగస్వామి, ఏఈవో లక్ష్మణ్, వీఆర్వో జ్యోతి, రైతులు కృష్ణ, శ్రీనివాస్రెడ్డి, కిషన్, గుండ్ల జంగయ్య ఉన్నారు.
మాడ్గుల, నవంబర్ 28 : మండలంలోని నాగిళ్ల, ఆర్కపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో వరిధ్యానం కొనుగోలు కేంద్రాలను ఆదివారం తూనికలు, కొలతల శాఖ ఇన్స్పెక్టర్ అశోక్, సీఐ కృష్ణమోహన్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన తూకం కాంటాలను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతులు ఉన్న తూకం వేసే యంత్రాల ద్వారానే ధాన్యం కొనుగోలు చేపట్టాలన్నారు. అవకతవకలకు పాల్పడిన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకొంటామని సిబ్బందిని హెచ్చరించారు. బ్రాహ్మణపల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రంలోని తూకంలో తేడాలపై రైతులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు.
మార్కెట్ ధరకే..
ఆమనగల్లు, నవంబర్ 28 : రైతులు తమ పంటలను దళారులకు విక్రయించి ఇబ్బందులు పడొద్దని సింగిల్విండో చైర్మన్ గంప వెంకటేశ్ కోరారు. ఆదివారం ఆమనగల్లు మండల కేంద్రంలో పీఏసీఏస్ ఆధ్వర్యంలో మహేశ్వరి రైస్ మిల్లులో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సబ్సిడీ కింద విత్తనాలు, ఎరువులు అందించడంతో పాటు పంటలకు మార్కెట్ ధర అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదన్నారు. కార్యక్రమంలో సింగిల్విండో వైస్చైర్మన్ సత్యం, కార్యదర్శి దేవేందర్, నాయకులు రమేశ్ పాల్గొన్నారు.