మెదక్, నవంబర్ 27 : రాబోయే యాసంగి సీజన్లో వరి సాగు నివారిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులను దృష్టిసారించేలా కృషి చేయాలని రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వానకాలం ధాన్యం కొనుగోలు, యాసంగి పంట ప్రణాళిక వంటి అంశాలపై శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 1 కేజీ బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని సీఎస్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా యాసంగి వరి పంట బాయిల్డ్ రైస్ మాత్రమే తయారవుతుందని, కేంద్ర ప్రభుత్వం, ఎఫ్సీఐ బాయిల్డ్ రైస్ కొనుగోలు నిరాకరిస్తున్న నేపథ్యంలో వరి పంట సాగు శ్రేయస్కరం కాదని సీఎస్ పేర్కొన్నారు. యాసంగి సీజన్లో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే దిశగా రైతువేదికలో వెంటనే పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని తెలిపారు.
ఇప్పటి వరకు 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ : మెదక్ కలెక్టర్ ఎస్.హరీశ్
ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక వ్యవసాయ విస్తరణాధికారిణి నియమిస్తూ ప్రతి మూడు రోజులకోసారి తమ పరిధిలో ఆరు కొనుగోలు కేంద్రాల్లో రైతులు వేసిన పంట వివరాల జాబితాతో ఇతర జిల్లాల నుంచి ధాన్యం రాకుండా కట్టడి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ధాన్య ం కొనుగోలుకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఇప్పటి వరకు 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నామని తెలిపారు. యాసంగి సీజన్లో ఎఫ్సీఐ ద్వారా ఉప్పుడు బియ్యం (పారా బాయిల్డ్ బియ్యం) కొనబోనని కేంద్ర ప్రభుత్వం ఖరాఖండిగా చెప్పిన నేపథ్యంలో రైతులు వరి పంట వేయకూడదని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ రమేశ్, అదనపు ఎస్పీ కృష్ణమూర్తి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరశురాం నాయక్, ఆర్డీవో సాయిరాం తదితరులు పాల్గొన్నారు.