నిత్యావసర సరుకులు తరలించే వాహనాలకు పాసులు ఇవ్వాలి
టెలీకాన్ఫరెన్స్లో కలెక్టర్ శశాంక
కార్పొరేషన్, మే 26: లాక్డౌన్ సమయంలో నిత్యావసర సరుకుల రవాణాకు అంతరాయం కలుగకుండా చూడాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం ఆయన నిత్యావసర సరుకుల రవాణా, ధరల నియంత్రణపై సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వివిధ ప్రాంతాల నుంచి నిత్యావసర సరుకులు, ఎరువులు, ఇతర సరుకులతో వచ్చే వాహనాలు ఆపకుండా పాసులు జారీ చేయాలన్నారు. రవాణాలో అంతరాయం కలిగితే నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు. హోల్సేల్ మారెట్లో నిత్యావసర సరుకుల ధరలు పెంచకుండా అధికారులు తనిఖీ చేయాలని ఆదేశించారు. సరుకుల రవాణా వాహనాలను ఆపకుండా, జిల్లాలో నిర్ణయించిన అంబులెన్స్ చార్జీలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని డీటీసీకి సూచించారు. వానకాలం సీజన్కు అవసరమైన ఎరువులు, విత్తనాల రవాణాలో సమస్యలు రాకుండా చూడాలని జిల్లా వ్యవసాయాధికారిని ఆదేశించారు. జిల్లాలో ఇంజెక్షన్లు, మందులు కృత్రిమ కొరత సృష్టించకుండా తగిన చర్యలు తీసుకోవాలని డ్రగ్ ఇన్స్పెక్టర్కు సూచించారు.
ఆటో, క్యాబ్ డ్రైవర్లు, రైతుబజార్లో కూరగాయలు, పండ్లు, పూలు అమ్ముకునే వారు, వీధి వ్యాపారులు, కిరాణం, మాంసం, చికెన్, మద్యం దుకాణాలు, వ్యవసాయ మారెట్లలో పనిచేసే హమాలీలు, హోటళ్లు, పెట్రోల్ బంకులు, ఇండ్లల్లో పని చేసేవారు, నిత్యావసర సరుకుల పంపిణీ డీలర్లు, వంటగ్యాస్ సరఫరా చేసే వారిని సూపర్ స్పైడర్లుగా గుర్తించి జాబితా తయారు చేయాలన్నారు. వీరందరికీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రాధాన్యతా క్రమంలో ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టి టీకా వేయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. టెలీకాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, ఉద్యానవన శాఖ ఉపసంచాలకుడు శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, జిల్లా మారెటింగ్ అధికారి పద్మావతి, జిల్లా పౌర సరఫరాల అధికారి సురేశ్రెడ్డి, సివిల్ సప్లయ్ డీఎం శ్రీకాంత్రెడ్డి, డీటీసీ చంద్రశేఖర్గౌడ్, డ్రగ్ ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్, డిప్యూటీ లేబర్ కమిషనర్ రమేశ్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ నరేందర్, కరీంనగర్, హుజూరాబాద్ ఆర్డీవోలు ఆనంద్కుమార్, రవీందర్రెడ్డి పాల్గొన్నారు.
ప్రైవేట్ అంబులెన్సుల చార్జీలు నిర్ణయం
జిల్లాలో ప్రైవేట్ అంబులెన్స్లకు కిలోమీటర్ల వారీగా చార్జీలు (కిరాయి) నిర్ణయించినట్లు కలెక్టర్ శశాంక ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అంబులెన్స్ల డ్రైవర్లు, యజమానులతో డీటీసీ సమావేశం నిర్వహించి వారి ఆమోదంతో చార్జీలు కిలోమీటర్ల వారీగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. 10 కిలో మీటర్ల దూరం వరకు ఆక్సిజన్ లేకుండా రూ. 2 వేలు, ఆక్సిజన్తో రూ. 2,500, 11 నుంచి 20 కిలోమీటర్ల వరకు ఆక్సిజన్ లేకుండా రూ. 3 వేలు, ఆక్సిజన్తో రూ. 3 వేలు, 21 నుంచి 30 కిలో మీటర్ల వరకు ఆక్సిజన్ లేకుండా రూ. 3,300, ఆక్సిజన్తో రూ. 3,500, 31 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఆక్సిజన్ లేకుండా రూ. 3,500, ఆక్సిజన్తో రూ. 4 వేలు నిర్ణయించినట్లు తెలిపారు. 41 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఆక్సిజన్ లేకుండా రూ. 3,700, ఆక్సిజన్తో రూ. 4,500, 51 నుంచి 60 కిలో మీటర్ల వరకు రూ. 4 వేలు, ఆక్సిజన్తో రూ.5 వేలు, 61 నుంచి 70 కిలోమీటర్ల వరకు ఆక్సిజన్ లేకుండా రూ. 4,200, ఆక్సిజన్తో రూ. 5,500, 71 నుంచి 80 కిలో మీటర్ల వరకు ఆక్సిజన్ లేకుండా రూ. 4,500, ఆక్సిజన్తో రూ. 6 వేలు చెల్లించాలని పేర్కొన్నారు. 81 నుంచి 90 కిలో మీటర్ల వరకు ఆక్సిజన్ లేకుండా రూ. 5 వేలు, ఆక్సిజన్తో రూ. 6,700, 91 నుంచి 100 కిలో మీటర్ల వరకు ఆక్సిజన్ లేకుండా రూ. 5,500, ఆక్సిజన్తో రూ. 7,500, 101 నుంచి 125 కిలో మీటర్ల వరకు ఆక్సిజన్ లేకుండా రూ.6,500, ఆక్సిజన్తో రూ. 8200, 126 నుంచి 150 కిలో మీటర్ల వరకు ఆక్సిజన్ లేకుండా రూ. 7,200, ఆక్సిజన్తో రూ. 9 వేలు, 151 నుంచి 200 కిలో మీటర్ల వరకు ఆక్సిజన్ లేకుండా రూ. 8 వేలు, ఆక్సిజన్తో రూ. 10 వేలు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ చార్జీల్లో అంబులెన్స్లో వెంటిలేటర్ సౌకర్యం, టెక్నీషియన్ లేకుండా రేట్లు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. 200 కిలో మీటర్లకుపైగా దూరం ఉంటే ప్రతి కిలోమీటరుకు రూ.20 చొప్పున చార్జీ వసూలు చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. రెండు గంటల వరకు వెయిటింగ్ చార్జీ చెల్లించాల్సిన అవసరం లేదని, రెండు గంటలు దాటితే ప్రతి గంటకు వెయిటింగ్ చార్జీ రూ.500 చెల్లించాలన్నారు. 150 కిలో మీటర్ల కంటే ఎకువ దూరం అంబులెన్స్ వెళ్తే డ్రైవర్ బస్తా రూ.500 చెల్లించాలని ఆయన తెలిపారు.