ఉద్యమ నేతకు సీఎం కేసీఆర్ సమున్నత స్థానం
యాదాద్రి జిల్లా తొలి అధ్యక్షుడిగా అరుదైన గౌరవం
ఆయిల్ఫెడ్ చైర్మన్ సేవలందిస్తున్న కంచర్ల
ముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి అభినందనలు
మోత్కూరులో టీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు
మోత్కూరు, జనవరి 26 : టీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా తొలి అధ్యక్షుడిగా ఆ పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన నిబద్ధత, స్వరాష్ట్రంలో సంక్షేమ పథకాలను రైతులకు సమర్థవంతంగా చేరవేయడంలో సంకల్ప సిద్ధి, గులాబీ గెలుపుల్లో రాజకీయ చతురతను గుర్తించి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ జిల్లా పగ్గాలను అప్పజెప్పారు. మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన కంచర్ల రామకృష్ణారెడ్డి 45 ఏండ్లుగా రాజకీయాల్లో చురుగ్గా కొనసాగుతున్నారు. పాతికేండ్లు సింగిల్ విండో చైర్మన్గా రైతులకు అందుబాటులో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ యాదాద్రి జిల్లా తొలి అధ్యక్షుడిగా రామకృష్ణారెడ్డికి సీఎం కేసీఆర్ అవకాశమివ్వడాన్ని హర్షిస్తూ మోత్కూరులో టీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చి సంబురాలు చేశారు. ప్రకటన అనంతరం రామకృష్ణారెడ్డి ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మినిస్టర్స్ క్వార్టర్స్లో మంత్రి జగదీశ్రెడ్డిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ను మరింత బలోపేతం కృషి చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజలకు చేరువ చేయాలని మంత్రి సూచించారు. సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ను పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు.
యాదాద్రి భువనగిరి టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఆ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు, ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనలో ఉద్యమకారులకు అధిక ప్రాధాన్యత కొనసాగుతున్నది. మోత్కూరు మండలంలోని దత్తప్పగూడెం గ్రామానికి చెందిన కంచర్ల రామకృష్ణారెడ్డి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. గత 45 ఏండ్లుగా రాజకీయాల్లో చురుకుగా పనిచేస్తూ ఈ ప్రాంత ప్రజలకు అన్ని రంగాల్లో సేవలు అందించారు. 25 ఏండ్లుగా సింగిల్ విండో చైర్మన్గా బాధ్యతలను నిర్వర్తిస్తూ రైతులకు సేవలను విస్త్రత పరిచారు. సీపీఐతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి 2001లో అప్పటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ న్యాయకత్వంలో టీఆర్ఎస్లో చేరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిరంతరం పని చేశారు. 2014, 18లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదేవిధంగా సార్వత్రిక ఎన్నికలోనూ తుంగతుర్తి, భువనగిరి టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపులో కీలకపాత్ర పోషించారు. రాజకీయ ఎత్తుగడల్లో అపార అనుభవం కలిగిన కంచర్ల రామకృష్ణారెడ్డికి మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి, హరీశ్రావు, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఆశీస్సులు ఉన్నాయి. యాదాద్రి జిల్లా టీఆర్ఎస్ తొలి అధ్యక్షుడిగా రామకృష్ణారెడ్డి నియామకం కావడం పట్ల రైతులు, పార్టీ శ్రేణులు, జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడిగా నియమాకం కావడంతో రామకృష్ణారెడ్డి మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ను మర్యాద పూర్వకంగా కలిసి పూలబోకేలు అందజేశారు. జిల్లా అధ్యక్షుడిగా నియమాకానికి కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి సభ్యులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గోరుపల్లి సంతోష్రెడ్డి పాల్గొన్నారు.