పాలకవీడు, జనవరి 26 : మండలంలోని జాన్పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలు నేటి నుంచి మూడు రోజుల పాటు జరుగనున్నాయి. అందుకు అవసరమైన ఏర్పాట్లను వక్ఫ్బోర్డు, జిల్లా యంత్రాం ఆధ్వర్యంలో పూర్తి చేశారు. హిందూ, ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్న జాన్పహాడ్ దర్గాలో ప్రతి సంవత్సరం జనవరి చివరి వారంలో జరిగే ఉర్సుకు రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు ఇతర రాష్ర్టా ప్రజలు తరలివస్తారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఉత్సవాలను కొవిడ్ నిబంధనలతో జరిపించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.
ఉత్సవాలకు సిద్దం
వక్ఫ్బోర్డు , గ్రామ పంచాయతీ, రెవెన్యూ, పోలీస్శాఖల అధికారులు సమన్వయంతో ఉర్సుకు దర్గావద్ద తగిన ఏర్పాట్లు చేశారు. సఫాయి బాయి వద్ద, చందల్ఖానాలో పారిశుధ్య పనులు, రంగులు వేసే పనులు పూర్తి చేశారు. అపరిశుభ్రతను జేసీబీతో తొలగించారు. విద్యుత్ శాఖ అధికారులు దర్గా పరిసరాల్లో ప్రత్యేకంగా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. దర్గావద్ద, చుట్టుపక్కల రద్దీని నియంత్రించడానికి పోలీసులు ప్రత్యేక క్యూలైన్లకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. దర్గాను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆరోగ్యశాఖ వారు మూడు మెడికల్ క్యాంప్లను, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ శాఖల వారు 40 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. హుజుర్నగర్ సీఐ రామలింగారెడ్డి పార్కింగ్ ప్రదేశాలు, సీసీ కెమెరాల ఏర్పాట్లను పరిశీలించారు.
నేడు గుసూల్ షరీఫ్
గురువారం దర్గావద్ద గుసూల్ షరీఫ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం దర్గా లోపల సైదులు బాబా సమాధిపైన ఉన్న పాత చాదర్ను తొలగించి శుభ్రం చేస్తారు. అనంతరం కొవ్వత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం కొత్త దట్టీలు ఉంచి పూలతో అలంకరించి ఉర్సు ఉత్సవాలను ప్రారంభిస్తారు.