ప్రకటించిన అధిష్టానం
సంగారెడ్డి జిల్లా పగ్గాలు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు అప్పగింత
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మెదక్ జిల్లా బాధ్యతలు
సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి
సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన నేతలు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గులాబీ శ్రేణుల సంబురాలు
సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయను: చింతా ప్రభాకర్
పార్టీని మరింత బలోపేతం చేస్తా : పద్మాదేవేందర్రెడ్డి
పదవికి న్యాయం చేస్తా : ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి
సంగారెడ్డి(నమస్తే తెలంగాణ)/ మెదక్/ దుబ్బాక, జనవరి 26 ;మరో రెండేండ్లలో ఎన్నికలు ఉండడంతో పాటు మరింత బలోపేతమే లక్ష్యంగా టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పార్టీ జిల్లా సారథులను నియమించారు. జిల్లా సారథులుగా సమర్థులకే ఆయన పట్టం కట్టారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షులను ఖరారు చేస్తూ బుధవారం ప్రకటించారు. పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ను నియమించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఇక టీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలిగా స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికి పట్టం కట్టారు. ఆమెకు రెండు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె నియామకంపై మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించుకున్నారు. టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుత మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి నియమితులయ్యారు. ఆయన రెండుసార్లు ఎంపీగా గెలిచారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్కు సన్నిహితుడిగా పేరుంది.
టీఆర్ఎస్ జిల్లా రథసారథులు నియామకం అయ్యారు. బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్షుల పేర్లను ప్రకటించారు. ఇందులో భాగంగానే మెతుకుసీమలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల నియమించగా, మూడు జిల్లాలకు ముగ్గురు సమర్థులైన నాయకులకు పార్టీ బాధ్యతలను అప్పగించారు. పార్టీలో వారు చేస్తున్న సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ వారిని టీఆర్ఎస్ జిల్లా రథసారథులుగా ప్రకటించారు. మెదక్ జిల్లా కేంద్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా మహిళకు బాధ్యతలు అప్పగిస్తూ మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలిగా నియమించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిని సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు అధ్యక్షుల నియామకంపై ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీని మరింత బలోపేతం చేస్తా..
మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేస్తా. సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను. జిల్లాను అభివృద్ధి దశలో నడిపించడమే కాకుండా పార్టీని అందరి సహకారంతో మరింత బలోపేతం చేస్తా. 2001 నుంచి టీఆర్ఎస్లో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నడుచుకున్నా. అందరూ ఎమ్మెల్యేల, నాయకుల, కార్యకర్తల సహకారంతో టీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్తా. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు.
టీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలిగా పద్మాదేవేందర్రెడ్డి
మెదక్, జనవరి 26: కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవులకు సీఎం కేసీఆర్ బుధవారం గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. టీఆర్ఎస్లో కష్టపడి పనిచేసే వారికి పదవులు ఇవ్వడంతో మెదక్ జిల్లా నుంచి ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలిగా నియమించారు.
జడ్పీటీసీగా ప్రస్థానం ప్రారంభించిన పద్మాదేవేందర్రెడ్డి, అంచెలంచెలుగా ఎదిగి టీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. పద్మాదేవేందర్రెడ్డి రాజకీయ ప్రస్థానంలో వివిధ పదవులు చేపట్టారు. ముందుగా 2001లో రామాయంపేట జడ్పీటీసీగా ప్రస్థానం ప్రారంభించిన ఆమె, 2004లో రామాయంపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2005లో ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలిగా, మరోసారి కన్వీనర్గా పనిచేశారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 2009లో మెదక్ నుంచి ఇండిపెండెంట్గా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో మెదక్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది డిప్యూటీ స్పీకర్ పదవిని చేపట్టారు. 2018లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2022లో టీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు.
మెదక్ జిల్లా తొలి మహిళా అధ్యక్షురాలిగా..
టీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి నియమితులయ్యారు. మెదక్ జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవిని మహిళకు కేటాయించడంపై టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ స్పీకర్గా, ఎమ్మెల్యేగా మెదక్ నియోజకవర్గంలో చురుగ్గా పనిచేస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మెదక్లోని రాందాస్ చౌరస్తాలో బుధవారం స్వీట్లు పంచి బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు.
టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా కొత్త ప్రభాకర్రెడ్డి
దుబ్బాక, జనవరి 26: తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి నియమితులయ్యారు. బుధవారం టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ 33 జిల్లాలకు పార్టీ అధ్యక్షుల పేర్లను ప్రకటించారు. సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిని నియమించారు. ప్రభాకర్రెడ్డి నియామకంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన కొత్త ప్రభాకర్రెడ్డికి, సీఎం కేసీఆర్ అండగా ఉంటూ రాజకీయ ఎదుగుదలకు అవకాశం కల్పించారు. మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి వరుసగా రెండుసార్లు ఎంపీగా పోటీచేసే అవకాశం కల్పించారు. ఆ రెండు సార్లు ఎంపీగా కొత్త ప్రభాకర్రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. సీఎం కేసీఆర్కు నమ్మినబంటుగా, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావులతో అత్యంత సన్నిహితుడిగా ఉంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. క్రమశిక్షణకు మారుపేరుగా, పార్టీ శ్రేణులకు నిత్యం అందుబాటులో ఉంటారనే పేరుంది. 2014, 2019 శాసనసభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రాతినిత్యం వహించిన గజ్వేల్ నియోజకవర్గానికి ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పార్టీ ఇన్చార్జిగా వ్యవహరించారు. మెదక్ ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉమ్మడి మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో మంచి ప్రజాప్రతినిధిగా పేరు సంపాధించుకున్నారు. ప్రభాకర్రెడ్డి సేవలకు గానూ సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లా అధ్యక్ష పదవిని అప్పగించారు.
సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయను..
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ పటిష్టత కోసం చిత్తశుద్ధితో పనిచేస్తా. నాపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్, సహకరించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు. జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకుల సహకారంతో పార్టీని మరింత బలోపేతం చేస్తా.-చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే
టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి జనవరి 26, (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నియామకమయ్యారు. ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించటంపై జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్కు ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, భూపాల్రెడ్డి, మహిపాల్రెడ్డి, మాణిక్రావు, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, ఇతర పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సదాశివపేట బస్టాండ్, చింతా ప్రభాకర్ నివాసం వద్ద పెద్ద ఎత్తున పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టి సంబురాలు జరుపుకొన్నారు.
సదాశివపేట మున్సిపల్ చైర్మన్గా ప్రస్థానం ప్రారంభించిన చింతా ప్రభాకర్ అంచెలంచెలుగా ఎదిగి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియామకమయ్యారు. 1995 నుంచి 2000 వరకు సదాశివపేట మున్సిపల్ చైర్మన్గా చింతా ప్రభాకర్ పనిచేశారు. ఆ తర్వాత 2009లో సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం తీవ్రంగా సాగుతున్న తరుణంలో చింతా ప్రభాకర్ టీడీపీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. 2014లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 2014 నుంచి 2019 వరకు చింతా ప్రభాకర్ ఎమ్మెల్యేగా కొనసాగారు. ఐదేండ్ల కాలంలో సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండోమారు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తుండటంతోపాటు ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చింతా ప్రభాకర్ సత్సంబంధాలు కలిగి ఉన్నారు. పార్టీలో వివాదరహితుడిగా, అందరికీ అందుబాటులో ఉండే నాయకుడిగా చింతా ప్రభాకర్కు మంచి పేరున్నది. దీంతో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు టీఆర్ఎస్ పార్టీ పగ్గాలు అప్పగించటంపై టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనను కలిసిన వారిలో సంగారెడ్డి పట్టణ టీఆర్ఎస్ నాయకులు పెరుమాళ్ల నర్సింలు, కౌన్సిలర్ కొత్తపల్లి శ్రీకాంత్, ఆత్మకమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, నాయకులు అంజాద్, శ్రవణ్రెడ్డి, వాజిద్, చక్రపాణి, మల్లన్న, ముస్తఫా, చిన్నా తదితరులున్నారు.