రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
కొవిడ్ నేపథ్యంలో సాంస్కృతిక ప్రదర్శనలు నిలిపివేత
సంగారెడ్డి కలెక్టరేట్/ మెదక్, జనవరి 26: ఉమ్మడి మెదక్ జిల్లాలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. బుధవారం గణతంత్ర దినోత్సవాన్ని ఊరూవాడా ఘనంగా నిర్వహించుకున్నారు. కొవిడ్ నేపథ్యంలో జెండావందనానికే వేడుకలు పరిమితం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించలేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు వేడుకల్లో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం ఔన్నత్యాన్ని, రాజ్యాంగం గొప్పదనాన్ని తెలుసుకుని జాతినేతలను తలుస్తూ స్మరించుకున్నారు.
73వ గణతంత్ర వేడుకలు మెతుకు సీమలో ఘనంగా జరిగాయి. వీధివీధినా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. కాగా, కరోనా కారణంగా బుధవారం వేడుకలను నిడారంబంగానే నిర్వహించారు. సంగారెడ్డి, మెదక్ జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లలో కలెక్టర్లు హనుమంతరావు, హరీశ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసు గౌరవవందనాన్ని స్వీకరించారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, సీపీ శ్వేత జెండా పండుగలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్లు మాట్లాడుతూ జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అదేవిధంగా ఆయా జిల్లా కేంద్రాన్ని ఎస్పీ, సీపీ కార్యాలయాల్లో జరిగిన వేడుకల్లో పోలీసు అధికారులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన వేడుకల్లో ఎస్పీ రమణ కుమార్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి రాధికా రమణి, మెదక్లో జిల్లా అదనపు కలెక్టర్లు రమేశ్, ప్రతిమాసింగ్, ట్రైనీ కలెక్టర్ అశ్వినితానాజీవాకాడే, డీఆర్డీవో శ్రీనివాస్, డీఈవో రమేశ్కుమార్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి కృష్ణమూర్తి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరుశురాంనాయక్, డీపీవో తరుణ్, డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావు, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, డీఎస్పీ సైదులు, ఆయా శాఖల జిల్లా అధికారులు, ఆర్డీవో, వివిధ శాఖల ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.