నాటి యుద్ధవీరులు.. గ్రామ సంరక్షకులుగా సేవలు
పలుచోట్ల ప్రాణత్యాగం చేసిన గుర్తుగా సతీశిలలు
సాహసవీరులకు ఆలయాల్లో ఇప్పటికీ పూజలు
భీమదేవరపల్లి, డిసెంబర్ 25 :తమ ప్రాంతం కోసం జరిగిన యుద్ధాల్లో వీరమరణం పొందినవారిని .. గ్రామాలను రక్షించేందుకు ప్రాణత్యాగం చేసిన వారిని కొలవడం.. ఆరాధించడం.. స్మరించుకోవడం.. ఇప్పటికీ మన సంప్రదాయంగా వస్తున్నది. వీరులు మరణించినా.. ఊర్లను ఎప్పుడూ రక్షిస్తారనే నమ్మకంతో వారి జ్ఞాపకార్థం శిల్పాలు చెక్కి పూజించే ఆచారం చాలాచోట్ల కనిపిస్తుంటుంది. అలాంటి వీరత్వపు గుర్తులు చాలా గ్రామాల్లో ‘వీరగల్లు’లుగా ఉన్నాయి. ఆలయాల్లోనూ కొలువై నిత్యపూజలు అందుకుంటున్నాయి.
ప్రాణాలకు తెగించి యుద్ధాల్లో పాల్గొన్నవారు.. గ్రామాలకు రక్షణగా నిలిచే సాహస వీరులకు ప్రతీకలుగా ‘వీరగల్లు’లు ఇప్పటికీ పలు గ్రామాల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా తెలుగు రాష్ర్టాలు, తమిళ, కర్నాటక తదితర రాష్ర్టాల్లో వీరుల స్మారక శిల్పాలు విరివిగా ఉంటాయి. ఓ వ్యక్తి ఒక చేత బల్లెం లేదా కత్తి, విల్లంబు, ఈట పట్టుకుని శత్రువుతో యుద్ధం చేస్తున్నట్లుగా, జంతువులను చంపుతున్నట్లుగా, వీరస్వర్గం పొందినట్లుగా, అతడిని రంభ, ఊర్వశి తదితర అప్సరసలు ఆహ్వానిస్తున్నట్లుగా, శివుడు, శివలింగం, నంది విగ్రహాల్లో ఐక్యమైనట్లుగా ఈ వీరగల్లు శిల్పాలు కనిపిస్తాయి. వీరులు జైనమత అభిమానులైతే వారు కైవల్యం పొందినట్లు గుర్తుగా ఆసీనమైన బొమ్మలుంటాయి.
యుద్ధవీరులుగా.. గ్రామ సంరక్షకులుగా…
గ్రామాల్లో రైతులు, రకరకాల వృత్తి పనివాళ్లు, గ్రామాధికారులు ఉంటారు. నాటి కాలంలో గ్రామానికి 12మంది అయ్యగార్లు ఉండేవారు. వారిలో ఒకరు రక్షక భటులు. పౌరుషం కలిగిన వాళ్లనే ఇందులో ప్రధానంగా తీసుకుంటారు. పశువులను క్రూరజంతువుల నుంచి రక్షించడం, గ్రామాల్లో దొంగతనాలు జరుగకుండా చూడడం, స్త్రీలను రక్షించడం, శత్రువులపై ఎదురొడ్డి పోరాడడం వీరి విధి. వర్షాలు కురిసి చెరువులకు గండి పడిన సమయంలోనూ గ్రామాలను రక్షించేందుకు ప్రాణాలకు తెగించేవారు. ఒక్కోసారి ఆయా సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతారు. అలాంటి వారి వీరత్వానికి ప్రతీకగా గ్రామాల్లో విగ్రహాలు చెక్కి పూజిస్తుంటారు. వీరభద్రుడు, భైరవు రూపాల్లో వీరగల్లు విగ్రహాలు ఎక్కువగా కనిపిస్తాయి.
వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా..
వీరగల్లులను వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా పిలుస్తారు. కన్నడంలో వీర్గల్ అని, తమిళంలో నటుకల్ అని, ఇంగ్లిష్లో ‘హీరో స్టోన్’ అని అంటారు. జపాన్లోని సమూరాయ్ సంస్కృతిలో కనిపించే ‘సెప్పుక్కు’, ‘హరాకిరీ’ ఈ వీరగల్లులను తలపిస్తాయి. ప్రాచీన కాలంలో యుద్ధాల్లో ఓడిన వీరుల తలలను బంతులుగా ఉపయోగించి ‘శిర కందుక క్రీడా వినోదం’ చేసేకునే పద్ధతి ఉంది. దీంతోపాటు తమ చేతుల్లో మరణించిన శత్రువీరుల రక్తమాంసాలతో ఉండికించిన అన్నాన్ని కావలి దేవతలకు పొలిజల్లడం అనే.. ‘రణం కడుపు’ అనే సంస్కృతులు కూడా వీరగల్లుల్లో ప్రతిబింబిస్తాయి.
ములుకనూరులో వీరగల్లులకు పూజలు
భీమదేవరపల్లి మండలం ములుకనూరులోని పోచమ్మ ఆలయంలో వీరగల్లులకు నిత్య పూజలు చేస్తున్నారు. తల నరికిన ఓ వ్యక్తికి ఇరువైపులా వీరులు ఉన్న విగ్రహం ఇక్కడ ఉంది. ప్రాచీన కాలం నుంచే ఈ గ్రామంలో ప్రజలు వీరగల్లులను గ్రామదేవుళ్లుగా భావించి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం ఐబీ గెస్ట్హౌస్ వెనుకాల వీరోచిత వీరగల్లు ప్రతిమ ఉంది. వీరుడి తలపై సిగకప్పు, గుర్రానికి కవచం, చేతిలో కళ్లెం పట్టుకుని యుద్ధానికి వెళ్తున్న పోరాట పటిమ ఈ శిల్పంలో ఉట్టి పడుతుంది. వీరులు మరణిస్తే అతడి భార్య ప్రాణత్యాగం చేసుకుంటున్న ‘సతీశిలలు’ కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గొడిశాల ఆలయం ఆవరణలో చూడవచ్చు.
గ్రామరక్షణలో కీలకం..
నాడు యుద్ధంలో కంటే గ్రామాలను రక్షించడంలో వీరులు కీలకపాత్ర పోషించేవారు. ఆవులు, గొర్రెలు, మేకలు వంటి జీవాలను క్రూర జంతువుల బారి నుంచి రక్షించేవారు. దొంగతనాలు జరుగకుండా చూడడం, స్త్రీలను రక్షించడం, చెరువులు తెగితే గండి పూడ్చడం వంటి సాహసాలు చేసేవారు. ఒక్కోసారి ఈ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయేవారు. మరణించిన తరువాత కూడా గ్రామాలను రక్షిస్తారనే నమ్మకంతో వారి జ్ఞాపకార్థం శిల్పాలు చెక్కి ఆరాధించే సంప్రదాయం మనవద్ద ఉంది. అందులో భాగమే ఈ వీరగల్లు శిల్పాలు..
గల్లు అంటే రాయి అని అర్థం. యుద్ధాల్లో వీరమరణం పొందినవారిని.. గ్రామాలను సంరక్షించడంలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకోవడం.. ఇప్పటికీ సంప్రదాయంగా ఉన్నది. వారు భౌతికంగా లేకున్నా ఎప్పుడూ ప్రజలను రక్షిస్తారనే నమ్మకంతో వారి స్మృతి చిహ్నంగా చెక్కే శిల్పాలనే ‘వీరగల్లు’లు అంటారు. వీరుడు మరణిస్తే అతడి భార్యకూ సహగమనం చేసే పద్ధతి క్రీ.శ.10 నుంచి 18 వరకు కొనసాగింది. కాలక్రమేణా వీరగల్లులు చెక్కే విధానంలోనూ మార్పు వచ్చింది. క్రీ.శ. 17, 18వ శతాబ్దంలో తుపాకులు పట్టిన వీరుల శిల్పాలు కూడా వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. ప్రజలకోసం మరణించిన వ్యక్తి త్యాగానికి గుర్తుగా శిల్పాలు చేసి కొలుస్తూ భవిష్యత్ తరాలకు చరిత్రను, వీరత్వాన్ని తెలియజేయడమనే సంప్రదాయం ఇందులో కనిపిస్తుంది.