జిల్లాలో రసాయన ఎరువుల దుకాణాల తనిఖీ
ఇప్పటికే 50 దుకాణాల నుంచి నమూనాల సేకరణ
నిర్మల్ టౌన్, జూన్ 25 : అన్నదాతకు అండగా ఉండేందుకు సర్కారు చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే నకిలీ ఎరువులు, విత్తనాల సరఫరాకు అడ్డుకట్టపై దృష్టి సారించిన ప్రభుత్వం టాస్క్ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసింది. నకిలీ విత్తనాలు, ఎరువుల గుట్టురట్టు చేయగా.. తాజాగా అన్ని జిల్లాల్లో నకిలీ రసాయన ఎరువులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో రైతులు పత్తి, సోయా, మక్కజొన్న, పసుపు, తదితర పంటలను పెద్ద ఎత్తున సాగు చేయనున్నారు. మొలక దశ నుంచి పంట సంరక్షణకు రసాయన మందులను రైతులు వినియోగిస్తారు. పంట పొలాల్లో గడ్డిని నివారించేందుకు ైగ్లెఫోసెట్ మందును ప్రభుత్వం నిషేధించినా చాలా ప్రాంతాల్లో ఈ మందు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు దుకాణాలను తనిఖీ చేస్తున్నారు. నిషేధిత మందులు విక్రయించే డీలర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. రసాయన మందులకు సంబంధించిన వే బిల్లులను పరిశీలించి తేదీ, కంపెనీ, గడువు తదితర వివరాలు నమోదు చేసుకుంటున్నారు. జిల్లాలో నిర్మల్, ముథోల్, ఖానాపూర్, భైంసా వ్యవసాయ సబ్ డివిజన్లు ఉన్నాయి. పట్టణాలతో పాటు మండల, గ్రామీణ ప్రాంతాల్లో 350కి పైగా ఎరువులు, రసాయన మందుల దుకాణాలు ఉండగా, వాటిని తనిఖీ చేస్తున్నారు.
శాంపిళ్ల సేకరణ…
జిల్లాలో రసాయన మందుల వాడకాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు అన్ని దుకాణాల్లో ఉన్న రసాయన మందుల శాంపిళ్లను సేకరిస్తున్నారు. జిల్లా వ్యవసాయశాఖ గుర్తించిన మందులను మాత్రమే దుకాణాల్లో డీలర్లు విక్రయిస్తున్నా కొన్ని ప్రాంతాల్లో నకిలీ మందులను కల్తీ చేసి విక్రయించే అవకాశం ఉంది. అనుమానాలు ఉన్న రసాయన ఎరువుల డబ్బాల నుంచి నమూనాలు తీసి వాటిని ప్రత్యేక సీసాలో ప్యాక్ చేసి హైదరాబాద్లోని ల్యాబొరేటరీకి పంపాలని వ్యవసాయశాఖ రాష్ట్ర కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతో జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 18 మండలాలతో పాటు రెండు మున్సిపాలిటీలున్నాయి. వ్యవసాయశాఖ అధికారులు తమ పరిధిలో ఐదు దుకాణాలను తనిఖీ చేసి రసాయన మందుల స్టాక్, వివరాలు, గడువు ముగిసిన సమాచారం, నాణ్యత తదితర అంశాలను పరిశీలన చేసి అనుమానం వస్తే ల్యాబొరేటరీకి పంపాలని సూచించినట్లు జిల్లాకు చెందిన ఓ వ్యవసాయశాఖ అధికారి ‘నమస్తే తెలంగాణ’తో తెలిపారు.
ఇప్పటికే జిల్లాలో రెండు రోజుల నుంచి వ్యవసాయశాఖ అధికారులు రసాయన మందుల నకిలీలను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. 50 దుకాణాల నుంచి నమూనాలు కూడా సేకరించి వివరాలను ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. నకిలీ రసాయన మందులను విక్రయిస్తే చర్యలు తీసుకోనున్నారు. గడువు ముగిసినా, ప్రభుత్వం నిషేధించిన రసాయన మందులను విక్రయిస్తే లైసెన్సు రద్దు చేయడమే కాకుండా వ్యవసాయశాఖ చట్ట పరిధిలో శిక్ష విధించనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. రైతులు కూడా రసాయన మం దులు కొనుగోలు చేసినప్పుడు కంపెనీ రసీదుతో పాటు అన్ని వివరాలను చూసుకొని కొనుగోలు చేసుకోవాలని, డబ్బా మూతపై అనుమానం ఉంటే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.