రామగిరి, జనవరి 25 : ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా యంత్రాంగం కొవిడ్ నిబంధనలతో ఏర్పాట్లు చేసింది. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచనల మేరకు స్థానిక పరేడ్గ్రౌండ్లో వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. కలెక్టర్ తొలుత కలెక్టరేట్లో జెండావిష్కరణ చేసిన అనంతరం పరేడ్గ్రౌండ్లో 10గంటలకు జెండావిష్కరణలో పాల్గొననున్నారు. అధికారికంగా నిర్వహించే కార్యక్రమానికి పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసింది. జిల్లావ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు, కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు సైత ముస్తాబు చేశారు.
జెండా ఆవిష్కరణతో పాటు పలు కార్యక్రమాలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం 10 గంటలకు జెండావిష్కరణ పూర్తయ్యాక ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి పథకాలను కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ తన ప్రసంగంలో వివరించనున్నారు.
నడిగూడెం కోటలోనే జాతీయ జెండా రూపకల్పన
నడిగూడెం : దేశంలోని 130కోట్ల మంది నమస్కరించే జాతీయ జెండా సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలోని కోటలో రూపుదిద్దుకుంది. అప్పటి నడిగూడెంలో కోట నిర్మించుకుని పరిపాలన చేస్తున్న నాటి జమీందారు రాజా నాయిని వెంకటరంగారావు వద్ద జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వ్యవసాయ అభివృద్ధిపై పనిచేశారు. దాదాపుగా ఇక్కడ 20ఏళ్ల పాటు వ్యవసాయంలో తీసుకోవాల్సిన అభివృద్ధిపై పరిశోధనలు చేశారు. స్వాతంత్య్రం కోసం ఉధృతంగా పోరాటం జరుగుతున్న సమయంలో ఉద్యమానికి జెండా కావాలని మహాత్మా గాంధీ పిలుపునిచ్చారు. 1913 నుంచి జాతీయ జెండాకు నమూనాలు మొదలు పెట్టగా 1916లో లక్నో, 19191 జలంధర్లో పలువురు ఉద్యమ నాయకులు జాతీయ జెండా నమూనాలను ఆయా పోరాటాల్లో రూపొదించారు. తెలుపు, ఆకుపచ్చ, కాషాయం రంగులతో మధ్యలో నూలు ఒడికే రాట్నంతో రూపొదించిన జాతీయ జెండాను 1921మార్చి31న బెజవాడలో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాల్లో గాంధీజీ ఆమోదించారు. 1947లో స్వల్ప మార్పులు చేశారు.
ఉమ్మడి జిల్లా ప్రజలకు గణతంత్ర శుభాకాంక్షలు