కరోనా థర్డ్వేవ్ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న యంత్రాంగం
దవాఖానల్లో ఆక్సిజన్, ప్రత్యేక బెడ్లు సిద్ధం
ఇంటింటా సర్వేతో ఎక్కడికక్కడ కట్టడి
కిట్లతో ఐదారు రోజుల్లోనే కోలుకుంటున్న కరోనా బాధితులు
మెదక్/సంగారెడ్డి/ సిద్దిపేట, జనవరి 25 :వ్యాక్సినేషన్.. ఇంటింటా జ్వరసర్వే.. అవగాహన కార్యక్రమాలు.. పై మూడు విధానాలు అవలంబిస్తూ కరోనా థర్డ్వేవ్ను జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా ఎదుర్కొంటున్నది. మహమ్మారిని ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నది. మొదటి, రెండో దశ మాదిరిగా సీరియస్ పరిస్థితులు ప్రస్తుతం లేనప్పటికీ, నిర్లక్ష్యం, అజాగ్రత్త పనికిరాదని వైద్యులు సూచిస్తున్నారు. ప్రధానంగా ఇంటింటా జ్వరసర్వే సత్ఫలితాలనిస్తున్నది. వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. లక్షణాలు ఉన్న వారికి కరోనా కిట్ అందజేస్తున్నారు. బాధితులు ఐదారు రోజుల్లోనే కోలుకుంటున్నారు. తొంభై ఎనిమిది శాతం మంది ఇంటివద్దనే కోలుకుంటున్నారు. దీంతో దవాఖానలకు వెళ్లాల్సిన పరిస్థితి రావడం లేదు. కాగా, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి జిల్లాలో ఆక్సిజన్, బెడ్లు, మందులతో వైద్యశాఖ సిద్ధంగా ఉంది.
కరోనా కట్టడికి ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా కృషిచేస్తున్నది. దీనికోసం అన్ని చర్యలు చేపట్టింది. వ్యాక్సినేషన్ వేగిరం చేయడంతో పాటు ఇంటింటా జ్వర సర్వే చేపడుతున్నారు. అంతేకాకుండా పోలీస్, వైద్యశాఖ ఆధ్వర్యంలో కొవిడ్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంటింటా జ్వర సర్వే సత్ఫలితాలనిస్తున్నది. వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్యంపై ఆరాతీస్తున్నారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారికి కిట్లు అందజేసి, ఎక్కడికక్కడ కరోనాను కట్టడి చేస్తున్నారు.
మెదక్ జిల్లాలో ఐదు రోజుల్లో 1,64,683 ఇండ్ల సర్వే…
మెదక్, తూప్రాన్, నర్సాపూర్లో ప్రభుత్వ పెద్ద దవాఖానలు ఉన్నాయి. ఇందులో మెదక్ జిల్లా కేంద్ర దవాఖాలోని ఐసీయూలో 25 పడకలు, ఆక్సిజన్ బెడ్లు 75 ఏర్పాటు చేశారు. నర్సాపూర్లోని ఏరియా దవాఖానలో 40 ఆక్సిజన్ బెడ్లు, తూప్రాన్ సీహెచ్సీలో 25 పడకలు సిద్ధం చేశారు. మెదక్ జిల్లా కేంద్ర దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో 200 వరకు పడకలు ఉండగా, 95 పడకలను కరోనా థర్డ్వేవ్ కోసం సిద్ధంగా ఉంచామని వైద్యాధికారులు తెలిపారు. జిల్లాలో ఆక్సిజన్ ఇబ్బందులను పూర్తిగా దూరం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టంది. ఇంటింటా జ్వర సర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది. ఐదు రోజుల్లో 1,64,683 ఇండ్లల్లో జ్వర సర్వే నిర్వహించి 11,804 మందికి కరోనా కిట్లను అందజేశారు. ఈ సర్వేలో 633 బృందాలు పాల్గొన్నాయి. ప్రతీ ఇంటికి తిరుగుతూ ప్రజల ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. దగ్గు, జ్వరం, జలుబు ఉన్న వారికి వెంటనే మెడికల్ కిట్లను అందజేస్తున్నారు. ఇంటింటా జ్వరలో కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వెంటనే మెడికల్ కిట్లు అందజేస్తున్నారు. గతంలో కరోనా లక్షణాలు ఉన్న వారు భయపడేవారు. ఇప్పుడు కరోనా లక్షణాలు ఉన్న వారు ఐదు రోజులు మందులు వాడగానే కోలుకుంటున్నారు. ముక్కు, గొంతులో నొప్పి వస్తుందని, దగ్గు, చలి జ్వరం వస్తే కరోనా లక్షణాలు ఉన్నట్టు వైద్యులు గుర్తిస్తున్నారు.
ప్రైవేట్ దవాఖానలు వెలవెల..
మొదటి, రెండో వేవ్లో వచ్చిన కరోనాతో ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలు కిటకిటలాడాయి. కరోనా సోకిన వారు ప్రభుత్వ దవాఖానల్లో పడకలు ఉన్నా ప్రైవేట్లో చేరి చికిత్స పొందారు. దీంతో లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకున్నారు. ఇప్పుడు మూడో వేవ్లో కరోనా లక్షణాలు తక్కువగా ఉండడంతో ప్రైవేట్ దవాఖానలకు వెళ్లేవారు లేరు. ప్రైవేట్లో ఖాళీ పడకలే దర్శనమిస్తున్నాయి. గతంలో ఆక్సిజన్తో పాటు రెమిడిసివర్ ఇంజక్షన్ కోసం కరోనా రోగులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పు డు ఆ పరిస్థితి లేదు.
నిర్లక్ష్యం పనికిరాదు…
రోనా మొదటి, రెండో వేవ్లో ఉన్న సీరియస్ మూడో వేవ్లో లేదు. గతంలో కరోనా సోకిందంటే రోగి భయపడి చనిపోయే పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు కరోనా సోకినా ఐదు రోజుల్లోనే తగ్గిపోతున్నది. కేవలం జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటి స్వల్ప లక్షణాలతోనే ఎక్కువ మంది బాధపడుతున్నారు. లక్షణాలు ఉన్న వారికి వెంటనే మెడికల్ కిట్ అందజేస్తున్నాం. ఐదు రోజులు వాడితే తగ్గిపోతుంది. గతంలో మరణాల కేసులు చాలా నమోదయ్యాయి. థర్డ్వేవ్లో అలాంటి పరిస్థితి లేదు. అలా అని ప్రజలు నిర్లక్ష్యంగా ఉండవద్దు. తప్పకుండా మాస్క్ ధరించాలి. వ్యాక్సిన్ వేసుకోవాలి.
-డాక్టర్ వెంకటేశ్వర్రావు,డీఎంహెచ్వో మెదక్