తమకు తెలియకుండా రూ.4 లక్షలు డ్రా చేసిందని మహిళల ఆవేదన
సంస్థాన్ నారాయణపురం, నవంబర్ 23 : డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలిచ్చి మహిళలను ఆదుకోవాలనే ప్రభుత్వం లక్ష్యాన్ని సిబ్బంది చేతివాటం దెబ్బతీస్తున్నది. మండలంలోని శేరిగూడెం గ్రామానికి చెందిన ఓ బుక్ కీపర్.. డ్వాక్రా సభ్యులకు తెలియకుండా రూ.4 లక్షలు రుణం తీసుకుని చెల్లించకపోవడంతో పాటు అసలు డబ్బులు తాను తీసుకోలేదని సంఘం సభ్యులపై ఎదురు దాడికి దిగింది. తాము తీసుకోని రుణాన్ని చెల్లించాలని బ్యాంకు అధికారులు వేధిస్తున్నారని సభ్యులు వాపోతున్నారు. బుక్ కీపర్ చేసిన మోసాలను సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని సమస్యను పరిష్కరించాలని మహిళా సంఘం సభ్యులు కోరుతున్నారు.
అడిగితే ఎదురుదాడి…
గ్రామంలోని అంబేద్కర్ డ్వాక్రా మహిళా సంఘం సభ్యులు 2018లో రూ.2లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్లో అందరూ వృద్ధులు, చదువురాని వారు ఉండడంతో సదరు బుక్ కీపర్ సభ్యులు సంతకాలు తీసుకుని బ్యాంకు లో మాత్రం రూ. 5 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసింది. మంజూరైన రుణంలో బుక్ కీపర్ రూ.2 లక్షలు సభ్యులకు అందజేసింది. అయితే బుక్ కీపర్ తల్లి కూడా గ్రూప్లో సభ్యురాలు కావడంతో మిగిలిన రూ.3 లక్షలను వారు జమ చేసుకున్నారు. మరోసారి ప్రధాన మంత్రి స్కీంలో రూ.50 వేల రుణం ఇప్పిస్తానని చెప్పి సభ్యుల నుంచి సంతకాలు సేకరించి రూ.1.50 లక్షలు రుణం తీసుకుని సభ్యులకు మాత్రం రూ.50వేలు ఇచ్చి మిగిలిన లక్ష రూపాయలు తన అకౌంట్లో జమ చేసుకుంది. సంఘం సభ్యులు తీసుకున్న రూ.2 లక్షల రుణం చెల్లించి, మరో రుణం పొందడానికి బ్యాంకుకు వెళ్లగా సిబ్బంది మీ సంఘం రుణం తీరిపోలేదని ఇంకా రూ.4లక్షలు అప్పు ఉందని చెప్పడంతో సంఘం సభ్యులు కంగుతిన్నారు. విష యం ఆరా తీయగా బుక్ కీపర్ సంఘం సభ్యులకు తెలియకుండా మొదటి రుణ ంలో రూ.3 లక్షలు, రెండోసారి లక్ష, మొత్తంగా రూ. 4 లక్షలు డ్రా చేసినట్లు తేలింది.
ఈ విషయంపై సంఘం సభ్యులు బుక్ కీపర్ను నిలదీయడంలో తను డబ్బులు డ్రా చేయలేదని సంఘం సభ్యులు మీరే తీసుకున్నారంటూ బుకాయించి ఎదురుదాడికి దిగుతుందని సభ్యులు వాపోతున్నారు. కూలి పనులకు పోయి రూపాయి రూపాయి కూడా బెట్టి తీసుకున్న రుణం పైసలు కడుతున్నామని తీసుకోని రూ.4 లక్షలు కట్టలేమని అధికారులు పట్టించుకుని బుక్ కీపర్ నుంచి డబ్బులు వసూలు చేయాలని సంఘం సభ్యులు వేడుకుంటున్నారు.