మహబూబాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): మెడికల్, నర్సింగ్ కళాశాలల నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం సమీపంలో ఉన్న 551 సర్వే నంబర్లో గల 48 ఎకరాల్లో నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. 2022-2023 విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభించాలనే లక్ష్యంతో ఇప్పటికే నర్సింగ్ కళాశాలకు రూ.30కోట్లతో టెండర్లు పూర్తి చేసి, పనులను ప్రారంభించారు. ఈ కళాశాలకు 150 సీట్లు మంజూరు చేయగా, వీటికి అనుబంధంగా ఉండే జిల్లా వైద్యశాలలో తాత్కాలిక ప్రాతిపదికన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు తెలంగాణ వైద్యవిద్య సంచాలకులు ప్రకటన జారీ చేశారు. అర్హులైన వారు ఈ నెల 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, 31న ఎంపిక జాబితా ప్రకటించనున్నట్లు తెలిపారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లాతోపాటు రాష్ట్రంలోని సంగారెడ్డి, మంచిర్యాల, వనపర్తి, భద్రాద్రి కొత్తగూ డెం, జగిత్యాల, నాగర్ కర్నూల్ జిల్లాలో మెడికల్ కళాశాలల ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయి. జిల్లాకు కేటాయించిన మెడికల్ కళాశాల పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మెడికల్, నర్సింగ్ కళాశాలలకు అనుబంధంగా ఉండే జిల్లా వైద్యశాలలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రొఫెసర్లు-42, అసోసియేట్ ప్రొఫెసర్లు-52, అసిస్టెంట్ ప్రొఫెసర్లు -143, మొత్తం 237 పోస్టులకు తెలంగాణ వైద్యవిద్య సంచాలకులు ప్రకటన జారీ చేశారు. వైద్య విధాన పరిషత్, వైద్యారోగ్య శాఖల్లో పనిచేస్తున్న అర్హులైన పీజీ వైద్యులను కౌన్సెలింగ్ ద్వారా వైద్య కళాశాలల్లో పని చేసేందుకు ఎంపిక చేశారు. ఇవి కాక, మరిన్ని తాత్కాలిక ప్రాతిపదికన పోస్టులను నియమించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రొఫశ్రీసర్కు నెలకు రూ.1.90లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్కు రూ. 1.50 లక్షలు, అసిస్టెంట్ ప్రొఫెసర్కు రూ. 1.25లక్షల వేతనం ఉంది. అర్హులైన వారు ఈనెల 28వ తేదీలోగా (http:// dme.telangana. gov.in)లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 31న ఎంపిక జాబితాలను ప్రకటించనున్నారు. వచ్చే నెలలో సంబంధిత జిల్లాలకు చెందిన మెడికల్ కళాశాల తరఫున విధుల్లో చేరాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో 2022-2023 విద్యా సంవత్సరంలో కొత్తగా మెడికల్ కళాశాలను ప్రారంభించడంతో పాటు జూన్లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం ప్రవేశాలను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో నియామకాలు పూర్తి చేసేందుకు అధికారులు వేగంగా చర్యలు చేపట్టారు. త్వరలోనే బోధనేతర, పారామెడికల్, ఇతర సిబ్బందిని నియమించనున్నారు.
వేగంగా సాగుతున్న పనులు
జిల్లా ఎస్పీ కార్యాలయం సమీపంలో ఉన్న 551 సర్వే నంబర్లో 48ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు కేటాయించారు. ఈ స్థలం చుట్టూ ఇప్పటికే అధికారులు హద్దులు ఏర్పాటు చేసి, చుట్టూ ట్రెంచ్ పను లు సైతం పూర్తి చేశారు. ఇందులో మెడికల్, నర్సింగ్ కళాశాలలు, హాస్టల్ సముదాయాలను నిర్మించనున్నారు. ఇప్పటికే నర్సింగ్ కళాశాలకు రూ.30కోట్లతో టెండర్లు పూర్తి చేసి, పనులను ఆర్అండ్బీ అధికారులు ప్రారంభించారు. అధికారులు యుద్ధ ప్రాతిపాదికన పనులు పూర్తి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం జిల్లాకు మెడికల్ కళాశాలను, అందులో 150 సీట్లు మంజూరు చేశారు. వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభం కానుండడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ కళాశాల ప్రారంభమైతే జిల్లాలో అభివృద్ధి చెందనుంది.