రాష్ట్రం రాక ముందు సాగు సాగలే..
తెలంగాణ వచ్చాక వ్యవసాయం పండుగైంది..
ఉమ్మడి జిల్లాలో అధికంగా పత్తి, క్యాబేజీ, క్యారెట్ పంటల సాగు
ఒకప్పుడు మన ప్రాంతం నుంచి వలస వెళితే.. ప్రస్తుతం మనవద్దకే వలస కూలీలు..
రంగారెడ్డి జిల్లా మాడ్గుల, షాబాద్ మండలాలు, వికారాబాద్ జిల్లా పరిగి, పూడూరు, నవాబుపేట్, కొడంగల్ మండలాలకు ఏటా కూలీల వలస
ఆంధ్రప్రదేశ్ కర్నూలు, మంత్రాలయ ప్రాంతాలతో పాటు కర్ణాటక రాష్ట్రం చిత్తాపూర్ నుంచి వస్తున్న కూలీలు
రోజుకు రూ.1000ల వరకు సంపాదన
రంగారెడ్డి, నవంబర్ 20, (నమస్తే తెలంగాణ): రాష్ట్రం రాక ముందు బతుకుదెరువు లేక బాధలనుభవించాం.. సాగు సాగక.. చేతినిండా పనిలేక.. కన్న ఊరు, ఉన్న గూడునొదిలి భారమైనా లెక్కచేయక పొట్ట చేతపట్టుకుని దూరప్రాంతాలకు వలస వెళ్లారు.. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక పరిస్థితులు పూర్తిగా మారాయి. మిషన్ కాకతీయతో చెరువులు, కుంటలన్నీ పునరుద్ధరించబడ్డాయి. చెక్డ్యాంలు, ప్రాజెక్టుల నిర్మాణంతో పుష్కలంగా సాగునీరు, ఉచితంగా కరెంట్ సరఫరాతో సబ్సిడీ ఎరువులు, విత్తనాలనూ అందజేస్తున్నది. సాగు పనులు మొదలు కాగానే రైతుబంధుతో పెట్టుబడి సాయం చేస్తూ పంట చేతికొచ్చేవరకు వెన్నుదన్నుగా నిలుస్తుండడంతో నేడు వ్యవసాయం పండుగలా మారింది. ఒకప్పుడు వలసలు వెళ్లిన మన ప్రాంతానికే ప్రస్తుతం ఇతర రాష్ర్టాల నుంచి కూలీలు వలస వచ్చి జీవనోపాధి పొందుతున్నారు.
వలస కూలీలను రంగారెడ్డి జిల్లా ప్రతి ఏటా ఆదుకుంటుంది. జిల్లాలో అత్యధికంగా సాగయ్యే పత్తి పంటను ఏరేందుకు జిల్లాకు వలస కూలీలు వస్తుంటారు. జిల్లాలోనే అత్యధికంగా పత్తి పంట సాగయ్యే మాడ్గుల మండలంతోపాటు షాబాద్ మండలంలో పలు గ్రామాలకు వలస కూలీలు జీవనోపాధికి వస్తుంటారు. మాడ్గుల మండలంలోని మాడ్గుల, పెద్ద మాడ్గుల, నల్లెరువు, ఇరివేను, బ్రాహ్మణపల్లి గ్రామాలు, షాబాద్ మండలంలోని బోడంపాడు, మన్మర్రి గ్రామాలకు పత్తి ఏరేందుకు కర్నూలు జిల్లా నుంచి కూలీలు వలస వస్తారు. మాడ్గుల మండలంలోని సంబంధిత గ్రామాల్లో 40వేల ఎకరాల్లో పత్తి సాగవుతుండగా, షాబాద్ మండలంలోని సంబంధిత గ్రామాల్లో 500-600 ఎకరాల్లో రైతులు పత్తిని సాగు చేస్తున్నారు. సంబంధిత మండలాలకు ప్రతీ ఏటా నవంబర్ మాసంలో వచ్చి జనవరిలో వెళ్తుంటారు. కర్నూలు జిల్లా నుంచి వచ్చే వలస కూలీలకు పని కల్పించడంతోపాటు ఆవాసం కూడా కల్పిస్తారు. వలస కూలీలు రోజుకు రూ.1000 వరకు సంపాదిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఒక్కో వలస కూలీ రోజుకు క్వింటాలుకుపైనే పత్తి ఏరుతారని సంబంధిత గ్రామాల రైతులు చెబుతున్నారు. కర్నూలులో రోజంతా కూలీ పనికి వెళ్లినా.. కేవలం రూ.200లు కూడా రాకపోతుండడంతో జిల్లాకు మూడు నెలలపాటు కుటుంబంతోపాటు వలస వచ్చి జీవనోపాధి పొందుతున్నారు. పత్తి ఏరేందుకు వచ్చే వలస కూలీలకు సంబంధిత గ్రామాల రైతులు రోజుకు కూలీ చొప్పున కాకుండా కిలోకు రూ.10ల చొప్పున కూలీలకు చెల్లిస్తున్నారు.
పూడూరు, పరిగి, కొడంగల్, నవాబుపేట్ మండలాల్లో పనులు..
తెలంగాణలో పుష్కలంగా పంటలు పండుతుండడంతో పనిచేసేందుకు ఇతర రాష్ర్టాల నుంచి కూలీలు వికారాబాద్ జిల్లా పరిధిలోని పలు ప్రాంతాలకు వస్తున్నారు. రోజుల తరబడి ఇక్కడే ఉండి పొలాల్లో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రతి సంవత్సరం పంటలు చేతికి వచ్చే సమయంలో కూలీలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి వికారాబాద్ జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాలకు వచ్చి పని చేస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పత్తి పంట, క్యారెట్, క్యాబేజీ పంటపొలాల్లో పనిచేస్తారు. ఆంధ్రా ప్రాంతంలో పత్తి తక్కువగా ఉండటం, వ్యవసాయ పనులకు సంబంధించి కూలీ పనులు లభించకపోవడంతో ప్రతి సంవత్సరం ఉపాధిని పొందుతున్నట్లు కూలీలు తెలిపారు.
ఏపీ, కర్ణాటక నుంచి కూలీలు
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, మంత్రాలయం ప్రాంతం ఎరిగెరె గ్రామానికి చెందిన వారు, కర్ణాటకలోని చిత్తాపూర్ ప్రాంతం నుంచి కూలీలు పనిచేసేందుకు వికారాబాద్ జిల్లా పరిగి, పూడూరు, నవాబుపేట్, కొడంగల్ మండలాల్లోని పలు గ్రామాలకు వస్తుంటారు. ప్రతి సంవత్సరం వానకాలం పంటలు చేతికి వచ్చే సమయానికి ఇక్కడికి చేరుకొని సుమారు నెల రోజులకు పైగా ఇక్కడే నివాసముండి పత్తి తీసే పనుల్లో కూలీలుగా పనిచేస్తారు. కొన్నేండ్లుగా కూలీ పని నిమిత్తం ఇక్కడికి వస్తున్నట్లు వారు తెలిపారు. కర్ణాటకలోని చిత్తాపూర్ ప్రాంతం కూలీలు రైలులో రోజు నవాబుపేట్ మండలంలోని పలు గ్రామాలకు వచ్చి కూలీ పనిచేసి తిరిగి రాత్రికి ఇంటికి వెళ్లిపోతుంటారు. వారు మండల పరిధిలోని చిట్టిగడ్డ, గొల్లగూడెం, పత్తి పంట, క్యాబేజీ, పూలు తెంపడం, క్యారెట్ పంట పొలాల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. నవాబుపేట్ మండలంలో పనిచేసే కూలీలకు రోజుకు రూ.400 పైచిలుకు కూలీ వస్తుందని, చెబుతుండగా పత్తి తీసే పనులు చేసే వారికి రోజుకు రూ.800 వరకు కూలీ అందుతుందని పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని తమ ప్రాంతంలో వరి, మిర్చి తదితర పంటలు అధికంగా ఉంటాయని, ప్రస్తుతం పొలాల్లో కూలీ పనులు లేని కారణంగా ఈ ప్రాంతంలో కూలీ పనులు చేసుకొంటున్నట్లు తెలిపారు. వారు ప్రతి రోజు ఉదయం 6 గంటలకే పొలాల్లోకి వెళ్లి పత్తి తీయడం ప్రారంభిస్తారు. తద్వారా రోజుకు 80 కిలోలకు పైగా పత్తి తీస్తారు. దీంతో పత్తి తీసే పనులు త్వరగా పూర్తవుతాయి. ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, మంత్రాలయం, కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కూలీపని చేసేందుకు కూలీలు ఇక్కడికి వస్తారు. పరిగి ప్రాంతంలో పనిచేసేందుకు మరో వారం, పది రోజుల్లో కూలీలు కర్నూలు ప్రాంతం నుంచి రానున్నట్లు సమాచారం. ఈ లెక్కన సుమారు వెయ్యి మంది పైచిలుకు కూలీలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి వచ్చి జిల్లాలోని పత్తి పొలాల్లో పనిచేస్తున్నారు. రెండు నెలలు ఇక్కడే ఉండి కూలీ పనిచేస్తారు. తమ ప్రాంతంలో పనులు లభించకపోవడం వల్లే ఇక్కడికి వస్తున్నట్లు వారు తెలిపారు. ఇక్కడ సరిపోను కూలీలు లభించక ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి కూలీలను తీసుకువస్తున్నారు.
షాబాద్కు 500 మంది వరకు వలస వస్తున్న కూలీలు
షాబాద్, నవంబర్ 20 : కర్నూల్ నుంచి షాబాద్కు కూలీలు వలస వస్తున్నారు. ప్రతి ఏడాది రెండు నెలల పాటు ఈ ప్రాంతంలో కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం అంతంతా మాత్రంగానే ఉండడంతో కూలీలకు పని దొరకడం లేదు. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ సాగు నీరందించడంతో రైతులు ఆయా రకాల పంటలు పుష్కలంగా పండిస్తున్నారు. జిల్లాలోనే షాబాద్ మండలంలో రైతులు అత్యధికంగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తారు. మండలంలోని బోడంపహాడ్, మన్మర్రి గ్రామాల్లో రైతులు తమకున్న పొలాల్లో పత్తిసాగు చేపడుతారు. పత్తి తీసేందుకు కూలీల కొరత ఉండడంతో ప్రతి ఏడాది కర్నూల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కూలీలను ఇక్కడికి తీసుకువస్తారు. వారికి రెండు నెలల పాటు ఇక్కడే ఉపాధి దొరుకుతున్నది. నవంబర్ నెల చివరి వారంలో వచ్చి జనవరి 15లోపు తిరిగి వెళ్లిపోతారు. షాబాద్ మండలంలోని బోడంపహాడ్, మన్మర్రి గ్రామాల్లో పత్తి తీసేందుకు ప్రతి ఏడాది 500మంది వరకు కూలీలు కర్నూల్ జిల్లా నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఒక్కో రైతు వద్ద 10నుంచి 20మంది వరకు కూలీలు పనులు చేస్తారు. కిలో పత్తి తీస్తే రూ. 10 చెల్లిస్తారు. ఒక్కో మహిళ కూలీ రెండు నెలల్లో రూ. 20వేల వరకు ఆదాయం సంపాదిస్తారు. ఇక్కడ కూలీల కొరత అధికంగా ఉండడంతో ఆంధ్రాకు వెళ్లి కూలీలను తీసుకువచ్చి పనులు చేయిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.