ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం
అప్రమత్తమైన రైతాంగం
పలు మండలాల్లో కురిసిన వర్షం
ఉమ్మడి జిల్లాపై తుఫాన్ ప్రభావం స్వల్పం
ఖమ్మం వ్యవసాయం/ బోనకల్లు/ చింతకాని/ జూలూరుపాడు/ కారేపల్లి/ కూసుమంచి/ పాల్వంచ/ కొత్తగూడెం/ కూసుమంచి రూరల్, మే 16: అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ (తౌక్టే) ప్రభావం ఉమ్మడి జిల్లాపై సల్పంగా పడింది. ఖమ్మం నగరంతోపాటు ఆయా మండలాల్లో శనివారం రాత్రి నుంచి చిరుజల్లులు కురిశాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉదయం వేళ బోనకల్లు, చింతకాని, మధిర, కూసుమంచి, ఎర్రుపాలెం, కొణిజర్ల, వైరా, కామేపల్లి, రఘునాథపాలెం తదితర మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సాయంత్రం వేళ ఖమ్మం నగరంలో చల్లబడిన వాతావరణానికి తోడు చిరుజల్లులు కురిశాయి. ఒకవైపు కరోనా ప్రభావం, మరోవైపు తుఫాన్ ప్రభావంతో గ్రామీణ ప్రాంత రైతులు ఆందోళనకు గురయ్యారు. పంట చేతికి వచ్చి కొనుగోలు కేంద్రాలకు తరలించే సమయంలో తుఫాన్ ప్రభావం పొంచి ఉండడంతో కంగారు పడుతున్నారు. గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కాపాడుకునేందుకు నిర్వాహకులు, రైతులు ముందస్తు చర్యలు చేపట్టారు. టార్పాలిన్లు కప్పారు. మొక్కజొన్న, మిర్చి పంటలు కల్లాల్లో ఉండటంతో అవి కూడా తడవకుండా రైతులు టార్పాలిన్ కవర్లు కప్పారు. ఖమ్మం నగరంలో వాతావరణం చల్లబడడంతో నగరవాసులు కాస్త సేదదీరారు. లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు తుఫాన్ చిరుజల్లులను ఆస్వాదించారు. తుఫాన్ ప్రభావం పెద్దగా లేకపోవడంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.
రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి
భద్రాద్రి జిల్లాలో రెండు రోజుల పాటు వడగళ్లు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణశాఖ సూచనల నేపథ్యంలో రైతులు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యంతోపాటు రైతుల వద్ద ఉన్న ధాన్యం తడవకుండా అన్ని జాగ్రత్తలు చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టరేట్ సిబ్బంది ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, రాత్రి 10 గంటలకు మూడుసార్లు సమగ్ర నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు.
అన్నదాతలు ఆందోళన చెందొద్దు: అదనపు కలెక్టర్
ఖమ్మం జిల్లాలో ఆదివారం కురిసిన అకాల వర్షం వల్ల ధాన్యం తడిచినా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అదనపు కలెక్టర్ మధుసూదన్ తెలిపారు. వర్షం వల్ల రైతుల ధాన్యం కల్లాల్లో, ఇతర ప్రాంతాల్లో తడిచినా వాటిని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని అన్నారు. రైతులెవరూ ఇబ్బందిపడవద్దన్నారు. రైతుల నుంచి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు చెప్పారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చినా కొనుగోలుకు ఎటువంటి ఇబ్బందిలేదన్నారు. ఈ మేరకు కొనుగోలు కేంద్రాల అధికారులకు ఆదేశాలు జారీచేశామన్నారు.