వారం రోజుల్లో ముగియనున్న కొనుగోలు ప్రక్రియ
ఇప్పటివరకు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
రూ.209 కోట్ల విలువ చేసే ధాన్యం సేకరణ పూర్తి
రైతుల బ్యాంకు ఖాతాల్లో చకచకా డబ్బులు జమ
127 కేంద్రాల నుంచి ధాన్యం కొనుగోళ్లు
హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
పరిగి, జనవరి 16 :తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. వికారాబాద్ జిల్లాలో 127 కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నది. గ్రేడ్ ‘ఏ’ రకం క్వింటాలుకు రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940 మద్దతు ధర చెల్లిస్తున్నది. ఇప్పటి వరకు సేకరించిన లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం విలువ రూ.209 కోట్లు కాగా, ప్రభుత్వం రైతుల ఖాతాల్లో త్వరితగతిన డబ్బులు జమ చేస్తున్నది. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మరో వారం రోజుల్లో ముగియనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయడం ద్వారా ప్రభుత్వం అన్నదాతలకు భరోసా కల్పిస్తున్నది. వానకాలంలో పండించిన వరి ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. వికారాబాద్ జిల్లా పరిధిలో ఇప్పటివరకు 1,06,736 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. వానకాలంలో లక్షా 2వేల ఎకరాల్లో వరి పంటను సాగు చేయగా సుమారు 2లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం ఉత్పత్తి జరుగుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ఈసారి దిగుబడి తగ్గడంతో ధాన్యం ఉత్పత్తి సైతం తగ్గిందని అధికారులు పేర్కొంటున్నారు. ఇందులోభాగంగా ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు కోసం అవసరమైన ప్రతిచోటా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 127 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయగా.. నవంబర్ 20 నుంచి జిల్లాలో ధాన్యం సేకరణ ప్రారంభమైంది. గ్రేడ్ ‘ఏ’ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.1,960, సాధారణ రకానికి 1,940 మద్దతు ధరగా నిర్ణయించారు. ఈమేరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారు.
1,06,736 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
జిల్లా పరిధిలో 127 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటివరకు 1,06,736 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. జిల్లావ్యాప్తంగా 23,306 మంది రైతుల నుంచి ధాన్యం సేకరణ చేపట్టారు. రూ.209కోట్ల విలువ చేసే ధాన్యం కొనుగోలు ఇప్పటివరకు జరుగగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.108కోట్లు జమ చేశారు. మరో రూ.80కోట్లు ఒకటి రెండు రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. దీంతోపాటు రూ.20కోట్లు అప్లోడ్ చేయాల్సి ఉన్నది. రైతుల నుంచి ధాన్యం సేకరణ జరిగి రైస్మిల్లులకు చేరిన వెంటనే సాధ్యమైనంత త్వరగా డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
తుది దశకు ధాన్యం కొనుగోలు
జిల్లా పరిధిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చివరి దశకు చేరుకున్నది. జిల్లా పరిధిలో 127 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా చాలా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు పూర్తయింది. దీంతో ఇప్పటివరకు 73 ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసివేశారు. మిగతా 54 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రస్తుతం ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఈ కేంద్రాల్లో మరో వారం రోజులపాటు ధాన్యం కొనుగోలు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. మరో 13వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం వచ్చే అవకాశం ఉందని, మొత్తం లక్షా 20వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదిలావుండగా సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కస్టమ్ మిల్లింగ్ కోసం జిల్లాలో ఎంపిక చేసిన 56 రైస్మిల్లులకు కేటాయించారు. ఆయా కేంద్రాల పరిధిలో సేకరించిన ధాన్యాన్ని ఏ రైస్మిల్లుకు కేటాయించింది స్పష్టం చేయడంతో సంబంధిత కేంద్రం నుంచి ఆయా రైస్మిల్లులకు ధాన్యాన్ని తరలిస్తారు. సేకరించిన ధాన్యంలో అత్యధిక శాతం ఆయా రైస్మిల్లులకు చేరవేశారు. కస్టమ్ మిల్లింగ్ అనంతరం రైస్మిల్లర్లు బియ్యం అందించనున్నారు. ఈ బియ్యం రేషన్ దుకాణాల ద్వారా తెల్లరేషన్కార్డుదారులకు అందజేయనున్నారు. దీంతో ఎక్కడికక్కడే బియ్యం పంపిణీ జరిగేలా కస్టమ్ మిల్లింగ్ తర్వాత వచ్చే బియ్యం స్టాకు ఏర్పాటు చేస్తారు.
1,06,736 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ