ఇబ్రహీంపట్నం/షాబాద్/ షాద్నగర్/ ఆమనగల్లు, జనవరి 16: ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, షాద్నగర్, ఆమనగల్లు నియోజకవర్గాల ప్రజలు సంక్రాంతి, కనుమ పండుగలను సంబురంగా జరుపుకొన్నారు. మహిళలు తమ నివాసాల ముందు వివిధ రకాల రంగుల ముగ్గులతో కనువిందు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పలువురు తమ నివాసాల్లో పాలపొంగలిని నిర్వహించుకున్నారు. అదే విధంగా పిండి వంటకాలను తయారు చేసి తమ ఇష్టదైవాలకు నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరికీ సంతోన్ని ఇవ్వాలని కోరుతూ దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. నివాసాల ముందు వేసిన ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలను పెట్టి పాటలు పాడుతూ ప్రదక్షిణలు చేశారు. చిన్నారులు, యువకులు వివిధ ఆకృతులతో కూడిన గాలిపటాలను ఎగురవేశారు. ఫరూఖ్నగర్ మండలం గిరాయిగుట్ట తండా లక్ష్మీనర్సింహస్వామి వారి దేవాలయంలో స్వామి కల్యాణోత్సవాన్ని కన్నలపండువగా నిర్వహించారు. కొందుర్గు మండ లం వెంకిర్యాల వేంకటేశ్వరస్వామి జాతరను వైభవం గా నిర్వహించారు. ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో కుటుంబీకులతో కలిసి గాలిపటాలు ఎగురవేశారు. యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో ముగ్గుల పోటీలు, క్రికెట్, వాలీబాల్, కబడ్డీ పోటీలను నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.