ఎల్లారెడ్డిపేట, రాచర్ల బొప్పాపూర్, రాచర్ల గొల్లపల్లిలో 264 మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు
నేడు మంత్రి కేటీఆర్ చేతులమీదుగా గృహప్రవేశాలు
ఇవే గాక పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
హాజరుకానున్న మంత్రి వేముల, పలువురు ప్రముఖులు
పూర్తయిన ఏర్పాట్లు
రాజన్న సిరిసిల్ల, జూన్ 15(నమస్తే తెలంగాణ)/ ఎల్లారెడ్డిపేట/బోయినపల్లి/: రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ బుధవారం సిరిసిల్ల జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో కలిసి సిరిసిల్ల, చొప్పదండి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ముందుగా ఉదయం 9గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 11గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్కు చేరుకొని, రెండు పడకల ఇండ్లను ప్రారంభిస్తారు. 12 గంటలకు రాచర్లగొల్లపల్లిలో, 12.30 గంటలకు ఎల్లారెడ్డిపేటలో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం 1.30 గంటలకు సిరిసిల్ల కలెక్టరేట్ ఎదురుగా పాత ఆర్అండ్బీ గెస్ట్హౌస్ స్థలంలో నిర్మిస్తున్న నూతన అతిథి గృహానికి భూమి పూజ చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆర్డీవో కార్యాలయం వద్ద తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ను ప్రారంభిస్తారు. 2.30 గంటలకు బోయినపల్లి మండలంలోని కొదురుపాక జంక్షన్ వద్ద రోడ్డు వెడల్పు పనులకు శంకుస్థాపన చేస్తారు. 3 గంటలకు కొదురుపాకలో రైతు వేదికను, 3.30 గంటలకు కేడీసీసీ బ్యాంకును ప్రారంభిస్తారు. 4.30గంటలకు విలాసాగర్లో చేపట్టిన సాగునీటి ఎత్తిపోతల లిఫ్ట్కు ప్రారంభోత్సవం చేసి, హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు. మంత్రుల రాక సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆత్మగౌరవ సౌధం
విశాలమైన స్థలం.. వీధివీధినా రోడ్లు.. ఇరువైపులా డ్రైనేజీలు, దారిపొడవునా పచ్చని చెట్ల మధ్య ఎల్లారెడ్డిపేట మండలంలో డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తయ్యాయి. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో.. కరీంనగర్-కామారెడ్డి ప్రధాన రహదారి పక్కన అపార్ట్మెంట్లను తలపించేలా 9.5కోట్లతో 168 గృహాలు నిర్మించారు. అలాగే రాచర్ల బొప్పాపూర్లో 48, గొల్లపల్లిలో 48 ఇండ్లు ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్నాయి. బుధవారం ప్రారంభోత్సవం జరుగబోతుండగా, లబ్ధిదారులు సంబురపడుతున్నారు.