2007 జనవరి 18..అంతా కలిసి నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని సింగవట్నం బ్రహ్మోత్సవాలకు పుట్టిలో పయనమయ్యారు. మరికొద్ది క్షణాల్లో తీరానికి చేరుకుంటారనేలోగా ప్రళయం ముంచుకొచ్చింది. మంచాలకట్ట సమీపంలో పుట్టి నీటమునిగిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న 61మంది జలసమాధి అయ్యారు. ఏం జరిగిందో తేలుకునేలోపే అంతా అయిపోయింది. కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి అప్పట్లోనే ప్రతిపాదనలు పంపినా కార్యాచరణకు నోచుకోలేదు. ఎట్టకేలకు స్వరాష్ట్రంలో వంతెన కష్టాలు తీరనున్నాయి. సోమశిల-సిద్ధేశ్వరం బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కొల్లాపూర్, జనవరి 17 : నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట వద్ద కృష్ణానదిలో పుట్టి మునిగి 61 మంది జలసమాధి అయిన ఘటనకు నేటితో 15 ఏండ్లు అయ్యింది. 2007 జనవరి 18వ తేదీన జరిగిన సింగవట్నం లక్ష్మీనర్సింహస్వామి బ్రహోత్సవాలకు రా యలసీమకు చెందిన భక్తులు కృష్ణానదిలో పుట్టిపై బయలుదేరారు. ఈ క్రమంలో మంచాలకట్ట వద్ద నదిలో మునిగి దుర్మరణం చెందా రు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ దుర్ఘటన జరిగిన మరుసటిరోజు ఆనాటి సీఎం వైఎస్సార్ హె లికాప్టర్లో మంచాలకట్టకు చేరుకొని బాధిత కుటుంబాలను ఓదార్చారు. ఇదిలా ఉండగా, తెలంగాణ-రాయలసీమ ప్రాం తాల ప్రజలు నిత్యం నదిలో పుట్టి ప్రయాణం చేస్తుంటారు. ఈ క్రమంలో నదిపై వంతెన నిర్మించాల్సిన ఆవశ్యకత ఎం తైనా ఉన్నది అని చెప్పి దివంగత వైఎస్సార్ బ్రిడ్జి మంజూరుకు హామీ ఇచ్చారు. నాగర్కర్నూల్-కొల్లాపూర్ డబుల్ రోడ్డుతోపాటు వంతెన నిర్మాణానికిగానూ రూ.251.30 కోట్లు మంజూరు చేస్తూ ఆనాటి ప్రభుత్వం మే 6, 2011న ఆర్టీ నెం.410 జారీచేసింది. 2009 ఫిబ్రవరి 13వ తేదీన కొల్లాపూర్లో ఆర్అండ్బీ గెస్ట్హౌస్ వద్ద వైఎస్సార్ శిలాఫలకాన్ని ప్రారంభించారు. కాగా, అదే ఏడాది హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించారు. దీంతో టెండర్ ప్రక్రియలో సాంకేతిక కారణాల వల్ల కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లడంతో సోమశిల-సిద్దేశ్వరం వంతెన మరుగునపడిపోయింది.
తెలంగాణ సర్కార్లో మోక్షం..
వంతెన, హైవే మంజూరు చేయాలని 2020 జూన్ 26వ తేదీన స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ద్ధన్రెడ్డి.. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఆ మరుసటి రోజే మంత్రి వేముల కేంద్ర ఉపరిత రవాణాశాఖ మంత్రి నితిన్గడ్కరీకి సమగ్ర సమాచారంతో లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరించి జాతీయ రహదారిగా గుర్తిస్తూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో హైవేకు ఎన్హెచ్ 167కే కేటాయించింది. కల్వకుర్తి (ఎన్హెచ్ 167కే) నుంచి ఆత్మకూర్ (ఎన్హెచ్ 340సీ) మీదుగా నంద్యాల వరకు 122 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి, సోమశిల-సిద్దేశ్వరం వంతెన నిర్మాణానికి భారత్మాల ఫేజ్-1లో చేర్చి కేంద్ర ప్రభుత్వం రూ.820 కోట్లు మంజూరు చేసింది. డ్రోన్ కెమెరాతో సర్వే ప్రక్రియ పూర్తయింది. హైవే అధికారులు డీపీఆర్ను సిద్ధం చేస్తున్నారు. వంతెనతోపాటు జాతీయ రహదారి పూర్తయితే హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-తిరుపతి మధ్య 80 కిలోమీటర్ల మేర దూరం తగ్గనున్నది. తెలంగాణ-రాయలసీమ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కృష్ణానదిపై పుట్టిలో ప్రయాణించే బాధలు తప్పనున్నాయి.