ధాన్యం కొనుగోళ్లతో మహిళా సంఘాలకు దండిగా ఆదాయం
రివాల్వింగ్ ఫండ్, మ్యాచింగ్ గ్రాంట్లతోపాటు ధాన్యం కమీషన్
బియ్యం సేకరణపై కేంద్రం మొండికేస్తే నష్టపోనున్న ‘ఎస్హెచ్జీ’లు
ఇక యాసంగి నుంచి నిరాశ తప్పదా!
సూర్యాపేట, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ కార్యక్రమం తలపెట్టినా అన్నివర్గాలకు న్యాయం చేసేలా ఉంటుంది. గతంలో వ్యవసాయం అంటేనే భయపడే స్థితిలో ఉన్న రైతాంగానికి సాగునీరు, విద్యుత్, సకాలంలో విత్తనాలు, ఎరువులతో పాటు పెట్టుబడి సాయం అందించి పండుగగా మార్చారు. వ్యవసాయం బాగుపడడంతో రైతులే కాదు కూలీలకూ చేతినిండా పని దొరుకుతున్నది. అనుబంధ రంగాలు ఆర్థిక పరిపుష్టి సాధించాయి. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో ధాన్యం సిరులు పండుతుండడంతో కొనుగోలు కేంద్రాల ద్వారా మహిళా సంఘాలకు అదనపు నిధులు సమకూరుతున్నాయి. నాలుగేళ్లుగా ఐకేపీ కేంద్రాల ద్వారా మహిళా సంఘాలు ధాన్యం కొనుగోళ్లు చేస్తుండడంతో సంఘాలకు ప్రభుత్వం నుంచి రివాల్వింగ్ ఫండ్, మ్యాచింగ్ గ్రాంట్లతోపాటు కమీషన్ రూపంలో కోట్లాది రూపాయలు దక్కాయి. ఐకేపీ ద్వారా కొనుగోలు చేసే ఏ-గ్రేడ్ రకం ధాన్యానికి క్వింటాకు రూ.32, సాధారణ రకానికి రూ.31.25 కమీషన్ మహిళా సంఘాలకు అందుతున్నది.
ఎనిమిది సీజన్లు.. 30.91 కోట్లు..
జిల్లాలో గత నాలుగేళ్లుగా ఏటా వానకాలం, యాసంగి సీజన్లలో (2017-18 వానకాలం పంట నుంచి 2020-21 యాసంగి వరకు) ఎనిమిది సీజన్లలో జిల్లా వ్యాప్తంగా ఐకేపీ సెంటర్ల ద్వారా 1,69,205 మంది రైతుల నుంచి 10.36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. దాంతో మహిళా సంఘాలకు రూ.30,91,31 ,627 కమీషన్ రూపంలో అందింది. మొదటి మూడేండ్లు (ఆరు సీజన్లు) కమీషన్ రూ.14.79 కోట్ల మహిళా సంఘాల ఖాతాల్లో జమ కాగా 2020-21కు సంబంధించిన కమీషన్ రూ.16.11 కోట్లు త్వరలోనే జమకానున్నాయి. అతి తక్కువగా 2017-18 వానకాలం సీజన్లో జిల్లాలోని 20 కొనుగోలు కేంద్రాల ద్వారా 32,463 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా.. రూ.13.80 లక్షల ఆదాయం ఎస్హెచ్జీలకు దక్కింది. అత్యధికంగా 2020-21 యాసంగిలో 3.66 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా.. రూ.11.69 కోట్లు కమీషన్ రూపంలో రానుంది. దీంతో ఆయా సంఘాల్లోని సభ్యులు తమ సొంత అవసరాలు, వ్యాపారాల కోసం తక్కువ వడ్డీలకు తీసుకునే రుణాలు గతంలో కంటే ప్రస్తుతం ఎక్కువ తీసుకునేందుకు అవకాశం ఏర్పడింది.
ధాన్యం కొనుగోలు చేయకపోతే ఆదాయం కోల్పోతాం
మునగాల రెండో సంఘబంధంలో వీబీకేగా పనిచేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ కేంద్రాలతో ధాన్యం కొనుగోలు చేయడంతో పెద్ద మొత్తంలో కమీషన్ దక్కింది. పని చేసినందుకు జీతం సైతం వచ్చింది. యాసంగి నుంచి కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోతే ఆదాయం కోల్పోయే ప్రమాదముంది. కేంద్రం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలి.