మల్యాల, అక్టోబర్ 14: సర్కారు నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లతో పేదలకు ఆత్మగౌరవం లభిస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. కేసీఆర్ చేపట్టిన ఆర్థిక, పాలనా సంస్కరణలతో తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే గణనీయంగా అభివృద్ధి చెందిందని చెప్పారు. గురువారం జగిత్యాల జిల్లా నూకపల్లి శివారులో జీ+1 పద్ధతిలో నిర్మించిన 65 డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి ప్రారంభించి లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించారు. అంతకుముందు కలెక్టర్ జీ రవి సమక్షంలో డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సొంత జాగాలు ఉండి ఇండ్లు నిర్మించుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రభుత్వం రూ. 5లక్షల ఆర్థిక సాయం చేయనున్నదని చెప్పారు. నిరుపేదలకు ఇండ్లు అందించే పథకం నిర్విఘ్నంగా కొనసాగుతుందన్నారు. చాలా ప్రాంతాల్లో స్థల సమీకరణ, కాంట్రాక్టర్లు ముందుకురాకపోవడం లాంటి సమస్యలు ఎదురైనందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతితో గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కల నెరవేరుతున్నదన్నారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా ఒంటరి మహిళలకు పింఛన్లు ఇస్తున్న ఘనత ఈ సర్కారుకే దక్కిందన్నారు. దళితుల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా దళితబంధును అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు దసరాకు ముందురోజే లబ్ధిదారులకు ఇండ్లను అందజేశామని చెప్పారు. వీటి నిర్మాణానికి రూ. 4.08కోట్లు వెచ్చించామన్నారు. కేసీఆర్ అమలు చేసిన పథకాలతో రాష్ట్రం అన్నిరంగాల్లో పురోగమిస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నదని, కేంద్రం మాత్రం మోటర్లకు మీటర్లు బిగిస్తూ వారి నడ్డివిరుస్తున్నదని విమర్శించారు. కలెక్టర్ గుగులోత్ రవి మాట్లాడుతూ 65 ఇండ్లకు గానూ 63 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. నూకపల్లి వారికి 33, రామన్నపేట వారికి 15,పోతారం వారికి 15 ఇండ్లను కేటాయించామన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఎమ్మెల్యే సొంత ఖర్చులతో నూతన వస్ర్తాలను సమకూర్చగా మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులతో ప్రజాప్రతినిధులు, అధికారులు సహపంక్తి భోజనాలు చేశారు.
కేసీఆర్ కాలనీగా నామకరణం..
లబ్ధిదారుల ఏకాభిప్రాయం మేరకు డబుల్బెడ్రూం ఇండ్ల సముదాయానికి కేసీఆర్ కాలనీగా నామకరణం చేశారు. 62వ ఇంటి లబ్ధిదారురాలు చిర్ర లావణ్య ఎమ్మెల్యే రవిశంకర్ దృష్టికి తీసుకురావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు బతికినంత కాలం కేసీఆర్కు రుణపడి ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో పీఆర్ ఈఈ రెహ్మన్, డీఈఈ మనోహర్రావు, ఆర్డీవో మాధురి, తహసీల్దార్ సుజాత, జడ్పీటీసీ కొండపలుకుల రాంమోహన్రావు, ఎంపీపీ మిట్టపల్లి విమల, మార్కెట్ కమిటీ చైర్మన్ జనగం శ్రీనివాస్, సహకార సంఘాల అధ్యక్షుడు బోయినిపల్లి మధుసూదన్రావు, అయిల్నేని సాగర్రావు,ముత్యాల రాంలింగారెడ్డి, సర్పంచులు మిట్టపల్లి సుదర్శన్,బద్దం తిరుపతిరెడ్డి, రాసమల్ల హరీశ్, గడ్డం జలజ, మారంపల్లి సరోజన, గడికొప్పుల రమేశ్, కట్కూరి తిరుపతి, ఎంపీటీసీలు కొల్లూరి గంగాధర్, షఫియాబేగం, మారంపల్లి నర్సవ్వ ఉన్నారు.
ఆనందంగా ఉన్నది..
ప్రభుత్వం అన్ని వసతులతో ఇల్లు నిర్మించి ఇవ్వడం ఆనందంగా ఉన్నది. జీవితంలో సొంతింట్లో ఉంటామని అనుకోలేదు. ఈ రోజు స్వయంగా మంత్రి కొప్పుల సారు ఇంటి పత్రాలు ఇచ్చిన్రు..బతికినంత కాలం ఈ సర్కారుకు రుణపడి ఉంట.
-గొంతి కవిత,లబ్ధిదారు,ఇంటి నంబర్ 2 (నూకపల్లి)
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటం
నేను, మా ఆయన రామన్నపేటలో హోటల్ నడుపుకొంట బతికేటోళ్లం. ఇంత కాలం సంపాదించింది పిల్లల చదువులు, వారి పెళ్లిలకు ఖర్చు అవడంతో ఇల్లు కట్టుకోలేపో యాం. ప్రభుత్వ పరంగా ఇండ్లు మాకు అందజేయడంతో ఎన్నో ఏండ్లుగా ఉన్న కల నెరవేరింది. మాకు ఊపిరి ఉన్నంతవరకు పెద్దాయన కేసీఆర్కు రుణపడి ఉంటం
-దొంతుల విజయ, లబ్ధిదారు, ఇంటి నంబర్ 35,( రామన్నపేట)