రామగిరి, డిసెంబర్ 13 : నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలకు అటానమస్ హోదా (స్వయం ప్రతిపత్తి)ను పెంచుతూ సోమవారం యూజీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే అటానమస్ హోదా కొనసాగుతుండగా దాని కాల పరిమితిని 2022-23 విద్యా సంవత్సరానికి పెంచింది. ఈ మేరకు ఉత్తర్వుల కాపీని ఎన్జీ కళాశాలకు, మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కూడా పంపింది.
ఎంతో మంది భవిష్యత్కు బాటలు
ఎన్జీ కళాశాలకు రాష్ట్రంలో విశిష్టమైన స్థానం ఉంది. ఎంతో మంది విద్యార్థుల ఉన్నత చదువుకు బాటలు వేసింది. ఇందులో చదివిన వారు ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు ప్రైవేట్లోనూ ఉద్యోగాలు సాధించి వివిధ హోదాల్లో ఉన్నారు. యూనివర్సిటీ స్థాయిలో సకల వసతులు ఉండటం, నిపుణులైన సీనియర్ అధ్యాపకులతో బోధన సాగిస్తుండటంతో మరోసారి అటానమస్ గుర్తింపు లభించింది. ఇప్పటికే కళాశాలకు న్యాక్ బీ గ్రేడ్ రాగా ఇది 2026 ఆగస్ట్ వరకు ఉండనుంది.
5వేల మందికిపైగా విద్యార్థులు..
ఎన్జీ కళాశాలలో ప్రస్తుతం 5వేల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. డిగ్రీ, పీజీ కోర్సుల్లో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో విద్యనభ్యసిస్తున్నారు. చదువుతోపాటు క్రీడలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ రంగాల్లో రాణిస్తున్నారు. విశాలమైన ఆటస్థలం, సైన్స్ కోర్సులకు ఆధునిక ల్యాబ్స్ ఉన్నాయి.