భువనగిరి అర్బన్, నవంబర్ 13 : మద్యం దుకాణాలు పొందిన వారు గతం కంటే అధిక లాభాలు గడించేందుకు వీలుగా ప్రభుత్వం టెండర్ విధానంలో కొత్త పాలసీని తీసుకువచ్చిందని ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎక్సైజ్శాఖ డిప్యూటీ కమిషనర్ జి.అంజన్రావు అన్నా రు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన రిజర్వేషన్ల బోర్డును పరిశీలించారు. అనంతరం టెండరు దారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కొత్త పాలసీలో భాగంగా ఒక వ్యక్తి ఒకే షాపు కోసం ఎన్ని దరఖాస్తులైనా, ఎన్ని షాపులకైనా దరఖాస్తు చేయవచ్చన్నారు. ప్రతి దరఖాస్తునకు రూ.2 లక్షలు డీడీ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో గతంలో 69 ఉండగా వాటిని 82కు పెంచిందని, ఇందులో గౌడ కులస్తులకు 21, ఎస్సీ-7, ఎస్టీ-1, మిగిలిన 53 షాపులు ఓపెన్ కేటగిరికి కేటాయించినట్లు చెప్పారు. గతంలో లైసెస్స్ ఫీజులో టర్నోవర్ ఏడింతలు దాటితే ట్యాక్స్ చెల్లించేవారని, ఈ సారి పదింతలు దాటిన తర్వాత ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. దుకాణాలు పొందిన వారికి గతం కంటే 30 శాతం లాభం అదనంగా వచ్చే అవకాశం ఉందన్నారు. గతంలో ఫీజును 4 కిస్తీల్లో చెల్లించాల్సి ఉంటే ఈ సారి ఆరుకు పెంచిందన్నారు. బ్యాంకు గ్యారంటీ కూడా గతంలో 50 ఉంటే దానిని 25 శాతానికి తగ్గించిదని పేర్కొన్నారు. సమావేశంలో ఎక్సైజ్శాఖ సూపరింటెండెంట్ కృష్ణప్రియ, ఎక్సైజ్ సీఐ నాగిరెడ్డి పాల్గొన్నారు.
దరఖాస్తులు ఇలా..
యాదాద్రి భువనగిరి జిల్లాలో 82 షాపులకుగాను శనివారం వరకు 19 దరఖాస్తులు వచ్చినట్టు భువనగిరి ఎక్సైజ్ సీఐ నాగిరెడ్డి తెలిపారు. బొమ్మలరామారంలో ఒకటి, రామన్నపేట 1, చౌటుప్పల్ 2, యాదగిరిగుట్ట 1, రాజాపేట 2, రఘనాథపురం3, తుర్కపల్లి 2, ఆత్మకూర్(ఎం) 1, వలిగొండలో 3 చొప్పున వచ్చినట్లు చెప్పారు.
మోత్కూరులో..
మోత్కూరు : మోత్కూరు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ సీహెచ్. చంద్రశేఖర్ తెలిపారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ మోత్కూరు సర్కిల్ పరిధిలోని మోత్కూరు, గుండాల, ఆత్మకూరు(ఎం), వలిగొండ పరిధిలోని వైన్స్లకు దరఖాస్తులను జిల్లా కేంద్రంలోని సూపరింటెండెంట్ కార్యాలయంలో అందించాలని సూచించారు. ఫారాలు నింపడంలో ఇబ్బందులు ఉంటే కార్యాలయ సిబ్బంది సీహెచ్ చంద్రశేఖర్ సెల్. 644012297 రాంబాబు సెల్.9052969615 జ్యోతి రెడ్డి సెల్.7702109861ను సంప్రదించాలని కోరారు.