వికారాబాద్ జిల్లాలో కోటి 39లక్షలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు
మోమిన్పేటలో 25లక్షల చేపపిల్లల ఉత్పత్తి
మిగతావి కొనుగోలుకు అధికారుల చర్యలు
మొత్తం చేపపిల్లల కోసం రూ.96.30 లక్షలు ఖర్చు
పరిగి, సెప్టెంబర్ 13 :మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఏటా ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తూ వారిని ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికే వర్షాలతో చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతుండగా.. ఈ ఏడాది కూడా చేప పిల్లల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈసారి వికారాబాద్ జిల్లాలో కోటి 39 లక్షల చేపపిల్లలను పంపిణీ చేయడమే లక్ష్యంగా మత్స్యశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ నెల 8వ తేదీన మంత్రి సబితారెడ్డి కోట్పల్లి ప్రాజెక్టులో చేప పిల్లలు వదిలి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరో 20 రోజుల్లో జిల్లావ్యాప్తంగా గుర్తించిన 775 చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మోమిన్పేట్ ఉత్పత్తి కేంద్రంలో మొత్తం 25 లక్షల చేప పిల్లలను ఉత్పత్తి చేయగా.. మిగతావాటిని కొనుగోలు చేసేందుకు టెండర్లు పిలిచారు. ఈసారి చేప పిల్లల కొనుగోలుకు రూ.96.30 లక్షలు వెచ్చించనున్నారు. జిల్లాలో 105 మత్స్యకారుల సంఘాలు ఉండగా.. ఉచిత చేపపిల్లల పంపిణీతో 4వేల మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది.
రాష్ట్రంలో నీలి విప్లవం తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్ మత్స్యకారుల కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. అందులో భాగంగా ప్రతి సంవత్సరం చెరువుల్లో పెంపకానికి సంబంధించి ఉచితంగా చేపపిల్లలు పంపిణీ చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలో ఈ సంవత్సరం ఉచితంగా కోటి39లక్షల చేపపిల్లల పంపిణీకి రంగం సిద్ధం చేయగా.. ఈ నెల 8న జిల్లా పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టులో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి చేప పిల్లలు వదిలే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటికే వర్షాలతో చెరువులు, కుంటలన్నీ నీటితో నిండిపోయాయి. అందువల్ల ఎంత త్వరగా చేపపిల్లలను వదిలితే అంత బాగా ఎదుగుతాయని పేర్కొంటున్నారు. ఇందుకుగాను జిల్లావ్యాప్తంగా గుర్తించిన 775 చెరువుల్లో చేపపిల్లలు వదిలే కార్యక్రమం చేపడుతున్నారు.
కోటి39లక్షల చేపపిల్లలు
వికారాబాద్ జిల్లా పరిధిలో ఈ సంవత్సరం కోటి39లక్షలు చేప పిల్లలు ఉచితంగా అందజేస్తారు. వాటిని జిల్లావ్యాప్తంగా గుర్తించిన 775 చెరువుల్లో వదిలిపెడతారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేపట్టారు. జిల్లాలో సంవత్సరం పొడవునా నీరు ఉండే 10 ప్రాజెక్టులు, పెద్ద చెరువులను ఎంపిక చేయగా.. వాటిలో 25లక్షలు పెద్ద చేప పిల్లలు వదులుతారు. జిల్లాలోని లఖ్నాపూర్ ప్రాజెక్టు, కోట్పల్లి ప్రాజెక్టు, సర్పన్పల్లి ప్రాజెక్టు, జుంటుపల్లి ప్రాజెక్టు, నందివాగు, కొంశెట్టిపల్లి చెరువు, శ్రీరాముల వారి ప్రాజెక్టు, ముద్దాయిపేట్ చిన్నవాగు, అల్లాపూర్ చెరువు, ఏర్పుమల్ల ప్రాజెక్టులలో సంవత్సరం పొడవునా నీళ్లుంటాయి. వీటిలో 80-100 మి.మీ పొడవైన 25లక్షల చేపపిల్లలను వదులుతారు. మరో 765 చెరువుల్లో 35-40 మి.మీ కోటి14లక్షల చేపపిల్లలను వదులుతారు. ఈ చెరువుల్లో సంవత్సరంలో 6 నుంచి 8 నెలలు నీళ్లుంటాయి.
మోమిన్పేట్లో 25లక్షలు చేపపిల్లల ఉత్పత్తి
జిల్లా పరిధిలోని మోమిన్పేట్లో ఈసారి సుమారు 25లక్షల వరకు చేపపిల్లల ఉత్పత్తి జరుగవచ్చని మత్స్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కేంద్రంలో 73 లక్షల స్పాన్ల ఉత్పత్తి జరిగింది. వాటి ద్వారా రేరింగ్ చేయడంతో సుమారు 30-40శాతం వరకే చెరువుల్లో వదిలేందుకు అవసరమైన సైజులో చేపపిల్లల ఉత్పత్తి జరుగుతుందని అంచనా వేస్తున్నారు. 80-100 మి.మీ సైజులో 25 లక్షలు, 35-40 మి.మీ 90 లక్షల చేప పిల్లల పంపిణీ కోసం ఇటీవల టెండర్లు పిలిచారు. 35-40 మి.మీ 90 లక్షల చేపపిల్లలకు రూ.55,80,000, 80-100 మి.మీ 25 లక్షల చేపపిల్లలకు రూ.40,50,000 ఖర్చు చేయనున్నారు. ఈ మేరకు సాధ్యమైనంత త్వరగా వాటిని పంపిణీ చేసేందుకు అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టారు. చేప పిల్లలు రాగానే జిల్లావ్యాప్తంగా ఉన్న చెరువుల్లో వదిలేందుకు సిద్ధం చేస్తున్నారు. సుమారు 20 రోజుల వ్యవధిలో జిల్లావ్యాప్తంగా 775 చెరువుల్లో చేపపిల్లలు వదిలే కార్యక్రమం పూర్తి చేయాలని మత్స్యశాఖ అధికారులు నిర్ణయించారు.
4వేల మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి
జిల్లావ్యాప్తంగా ఉన్న 775 చెరువుల్లో ఉచితంగా చేపపిల్లలు వదలడం ద్వారా ఆయా చెరువులపై ఆధారపడిన 4వేల మత్స్యకారుల కుటుంబాలకు మేలు చేకూరనుంది. జిల్లాలో 105 మత్స్యకారుల సంఘాలున్నాయి. వాటిలో 4వేల మంది సభ్యులున్నారు. ప్రతి సంవత్సరం ఉచితంగా చేపపిల్లలు పంపిణీ చేస్తుండడం ద్వారా ఆయా కుటుంబాలపై చేపపిల్లల కొనుగోలు భారం తగ్గిపోయింది. చేపల పెంపకంతోపాటు వాటిని మార్కెటింగ్ కోసం అవసరమైన వాహనాలు సరఫరా చేయడం వల్ల ఆయా కుటుంబాలు మరింత ఆర్థిక ప్రగతి సాధించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నది. ఏదిఏమైనా రాష్ట్రంలో నీలి విప్లవం తీసుకురావడంలో సర్కారు సఫలీకృతం అవుతున్నది.
వారంలోపే చేపపిల్లలు వదిలే కార్యక్రమం – దుర్గాప్రసాద్, జిల్లా మత్స్యశాఖ అధికారి
జిల్లా పరిధిలోని చెరువుల్లో వారం రోజుల్లోపే చేప పిల్లలు వదిలే కార్యక్రమాన్ని చేపడుతాం. చేపపిల్లల కోసం ఇప్పటికే టెండర్లు పూర్తి చేశాం. మోమిన్పేట్ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం ద్వారా సుమారు 25లక్షల చేప పిల్లలు ఉత్పత్తి కానున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి కోటి 15లక్షల వరకు చేపపిల్లలను కొనుగోలు చేసి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేపట్టాం. జిల్లావ్యాప్తంగా ఉన్న 775 చెరువుల్లో వదిలేందుకు ఈసారి కోటి39లక్షల చేపపిల్లలు ఉచితంగా అందజేస్తున్నాం.