ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్, మే 12 : జిల్లాలో లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నా రు. కలెక్టరేట్లో ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర, ఉన్నతాధికారులతో కలిసి బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్వర సర్వే, వ్యాక్సినేషన్, టెస్టింగ్ ప్రక్రియ కొనసాగించాలని సూచించారు. మొదటి విడుతలో గుర్తించిన కరోనా పాజిటివ్ వ్యక్తలను ఆరోగ్య పరిస్థితిని రెండో విడుతలో పరిశీలించాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ రాజేశం మాట్లాడుతూ మెడికల్ సిబ్బంది తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటించాలన్నారు. డీఎస్పీ అచ్చేశ్వరరావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
బాలల సహాయ వాణి మొబైల్ వాహనం ప్రారంభం
హాజీపూర్, మే 12 : కరోనా నేపథ్యంలో మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్వంలో పిల్ల ల సంరక్షణ కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన బాలల సహాయ వాణిని కలెక్టర్ భారతీ హోళికేరి, జిల్లా ఇన్చార్జి సంక్షేమ శాఖ అధికారి ఉమాదేవితో కలిసి జెండా ఊపి మొబైల్ వ్యాన్ను బుధవారం ప్రారంభించారు. అనంతరం బాలల సహయ వాణి పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా బారిన పడిన పిల్లలు, తల్లిదండ్రులు , పోషకులు కరోనా బారిన పడి వదిలి వేయబడిన పిల్లలు, నిస్సహాయ స్థితిలో ఉన్న పిల్లలకు సూచనలు, చేయూతను అందించేందుకు పని దినాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు. అవసరమున్న వారు 040 – 2373665తో పాటు 24 గంటలు పని చేసే నేషనల్ చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ 1098 లో సంప్రదించి వినియోగించు కోవాలన్నారు. జిల్లాలోని జైపూర్ మండలం పోలంపల్లిలో బాలల సంక్షేమ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్లైన్ సంచాలకుడు జిజో, సమన్వయ కర్త సత్యనారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.